ఈ ఏడాది ఫైనల్ చేరే జట్టు అదే అంటున్న కైఫ్.. సీజన్ మొదలుకాకముందే స్టార్ట్ చేశారా..!
IPL 2023: ఐపీఎల్ - 16 ప్రారంభానికి మరో ఐదు రోజుల టైమ్ ఉంది. ఇంకా ఒక్క మ్యాచ్ కూడా జరుగక ముందే.. ఎవరెలా ఆడుతున్నారో తెలియక ముందే ఫైనలిస్టులు కూడా రెడీ అయిపోతున్నారు.
భారత క్రికెట్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ ఫీవర్ మొదలైంది. అధికారికంగా ఈ లీగ్ మొదలవడానికి మరో ఐదు రోజుల సమయం ఉన్నా ఇప్పటికే అన్ని జట్లూ తమ ప్రిపరేషన్స్ ను ముమ్మరం చేశాయి. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్.. చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగనుంది. అయితే ఈ లీగ్ ఇంకా మొదలుకాకముందే ఫైనల్ వెళ్లే టీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్.
భారత జట్టు కీలక విజయాల్లో భాగంగా ఉన్న కైఫ్.. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాజస్తాన్ రాయల్స్ ఫైనల్స్ చేరుకుంటుందని అన్నాడు. ఫైనల్ చేరడానికి ఆ జట్టుకు సత్తా ఉందని తెలిపాడు.
కైఫ్ మాట్లాడుతూ.. ‘నా అభిప్రాయం మేరకు ఈసారి ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తప్పకుండా ఫైనల్ చేరుతుంది. ఎందుకంటే ఆ జట్టు చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఐపీఎల్ లో అద్భుతంగా రాణించే అశ్విన్, చాహల్ లో పాటు ప్రపంచస్థాయి బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఆ జట్టు సొంతం. ఈ సీజన్ లో రాజస్తాన్ మెయిన్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ లేకపోయినప్పటికీ బౌల్ట్.. ఆ లోటు లేకుండా చూసుకుంటాడు..’అని చెప్పాడు. అయితే కైఫ్ వ్యాఖ్యలపై రాజస్తాన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతుంటే వేరే ఫ్రాంచైజీల అభిమానులు మాత్రం సీజన్ మొదలుకాకముందే మొదలుపెట్టారా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఐపీఎల్ మొదటి సీజన్ లో కైఫ్.. రాజస్తాన్ తరఫునే ఆడాడు. షేన్ వార్న్ సారథ్యంలోని ఆ జట్టు తొలి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత రాజస్తాన్ పలుమార్లు ప్లేఆఫ్స్ కు వెళ్లినా ఫలితం శూణ్యం. ఇక గతేడాది రాజస్తాన్ అదిరిపోయే ప్రదర్శనలతో ఫైనల్ చేరింది. ఫైనల్ లో సంజూ శాంసన్ సేన.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడింది.
ఈ సీజన్ కు ముందు గత డిసెంబర్ లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో రాజస్తాన్ పలువురు కీలక ఆటగాళ్లను సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్, విండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్, ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపాలతో పాటు భారత వర్ధమాన స్పిన్నర్ మురుగన్ అశ్విన్ లను దక్కించుకుంది. బ్యాటింగ్ లో సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, షిమ్రన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, రియాన్ పరాగ్ వంటి ప్లేయర్లతో స్ట్రాంగ్ గా ఉన్న ఆ జట్టు.. బౌలర్లలో అశ్విన్, చాహల్, కుల్దీప్ సేన్, ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్ వంటి కీలక ఆటగాళ్లతో ఉంది.
ఐపీఎల్ 2023లో రాజస్తాన్ జట్టు : దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, జోస్ బట్లర్, కె.సి. కరియప్ప, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ఒబెడ్ మెక్కాయ్, ఆర్. అశ్విన్, రియాన్ పరాగ్, సంజూ శాంసన్, షిమ్రన్ హెట్మెయర్, ట్రెంట్ బౌల్ట్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, జేసన్ హోల్డర్, ఫెరీరా, కునాల్ రాథోడ్, ఆడమ్ జంపా, మురుగన్ అశ్విన్, ఆకాశ్ వశిష్ట్, అబ్దుల్ పీఎ, జో రూట్