వచ్చాడు విసిరాడు.. ఐపీఎల్-16లో ఫాస్టెస్ట్ డెలివరీ వేసిన ఫెర్గూసన్.. మళ్లీ జమ్మూ ఎక్స్ప్రెస్తో పోటీ షురూ..
IPL 2023: గతేడాది ఐపీఎల్ లో అందరి దృష్టిని ఆకర్షించిన ఇద్దరు బౌలర్లు లాకీ ఫెర్గూసన్ , ఉమ్రాన్ మాలిక్. ఈ ఏడాది కూడా ఈ ఇద్దరి మధ్య స్పీడ్ యుద్ధం మొదలైంది.
ఐపీఎల్ -16లో ‘స్పీడ్ వార్’ మొదలైంది. కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గూసన్, సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ల మధ్య పోటీకి ఐపీఎల్ మరోసారి సిద్ధమైంది. ఈ సీజన్ లో కేకేఆర్ కు ఆడుతున్న ఫెర్గూసన్.. ఆ జట్టు ఆడిన రెండు మ్యాచ్ లకు దూరంగా ఉన్నా ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ తో మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. తన మాజీ టీమ్ (గత సీజన్ లో ఫెర్గూసన్ గుజరాత్ టైటాన్స్ తో ఆడాడు) తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ - 16 లో అత్యంత వేగవంతమైన డెలివరీ సంధించాడు.
ఈ సీజన్ లో ఇప్పటివరకు 150 ప్లస్ స్పీడ్ వేసిన బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఒక్కడే. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ సందర్భంగా ఈ జమ్మూ కుర్రాడు.. 152 కి.మీ వేగంతో బంతులు విసిరాడు.
తాజాగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ఫెర్గూసన్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. గుజరాత్ తో మ్యాచ్ లో లాకీ.. నాలుగో ఓవర్లో 154 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. ఈ బాల్ ను శుభ్మన్ గిల్.. బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా సింగిల్ తీశాడు. కాగా ఈ స్పీడ్ తో ఫెర్గూసన్.. ఈ సీజన్ లోనే అత్యంత వేగవంతమైన డెలివరీ నమోదు చేసిన బౌలర్ గా నిలిచాడు. ఇక రాబోయే రోజుల్లో ఉమ్రాన్ - ఫెర్గూసన్ నడుమ మళ్లీ స్పీడ్ వార్ మొదలవడం ఖాయమని అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్.
గత సీజన్ లో కూడా అత్యంత వేగవంతమైన డెలివరీ వేసిన బౌలర్ ఫెర్గూసనే కావడం గమనార్హం. గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతూ రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన ఫైనల్స్ లో అతడు.. 157.3 కి.మీ. తో రికార్డు నమోదుచేశాడు. ఈ ఏడాది ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు సిద్ధమయ్యానని తాజా మ్యాచ్ తో ఫెర్గూసన్ చెప్పకనే చెప్పాడు.
ఇదిలాఉండగా ఈ సీజన్ లో ఫెర్గూసన్ ఫాస్టెస్ట్ డెలివరీని ఉమ్రాన్ మాలిక్ నేడు బ్రేక్ చేసే అవకాశాలున్నాయి. శనివాంర పంజాబ్ - హైదరాబాద్ మ్యాచ్ ఉంది. ఉప్పల్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ లో ఉమ్రాన్ ఈ రికార్డు బ్రేక్ చేస్తే మళ్లీ ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర సమరానికి తెరలేచినట్టే..
ఇక గుజరాత్ - కోల్కతా మధ్య అహ్మదాబాద్ లో జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (63), సాయి సుదర్శన్ (53), శుభ్మన్ గిల్ (39) లు రాణించారు. ఈ మ్యాచ్ లో ఫెర్గూసన్.. 4 ఓవర్లు వేసి 40 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.