రాజస్తాన్ నుంచి గుజరాత్ వరకు.. ఐపీఎల్లో విజేతలు వీళ్లే..
IPL 2023: శుక్రవారం నుంచి అహ్మదాబాద్ వేదికగా మొదలుకాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్ కు సర్వం సిద్ధమైంది. ఈ లీగ్ లో విజేతల జాబితాను ఓసారి చూద్దాం.
క్రికెట్ అభిమానులను రెండు నెలల పాటు ఎంతగానో అలరించే వినోదం మళ్లీ వచ్చింది. శుక్రవారం నుంచి ఐపీఎల్ - 16 మొదలుకానున్నది. ఈసారి ట్రోఫీ గెలిచేందుకు అన్ని జట్లూ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ఈ టోర్నీలో అత్యధిక సార్లు జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ తో పాటు ఇంతవరకూ కప్ కొట్టని ఆర్సీబీ, పంజాబ్, ఢిల్లీ లు ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. పలుమార్లు ప్లేఆఫ్స్, ఫైనల్స్ కు వెళ్లినా ఆర్సీబీ, ఢిల్లీలు కప్ కొట్టడంలో విఫలమయ్యాయి. కానీ ఈసారి ఆలోటును పూడ్చుకోవాలని అవి భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇంతవరకూ పదిహేను సీజన్లలో ఐపీఎల్ కప్ కొట్టిన విజేతలు, ఆయా జట్ల సారథులు, తదితర వివరాలు ఇక్కడ చూద్దాం.
- 2008లో మొదలైన ఐపీఎల్ లో తొలి ట్రోఫీ నెగ్గిన జట్టు రాజస్తాన్ రాయల్స్. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్స్.. మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రపంచ దిగ్గజ స్పిన్నర్ షేన్ వాట్సన్ అప్పుడు రాజస్తాన్ కు సారథిగా వ్యవహరించాడు.
- 2009లో ఐపీఎల్ గెలిచిన జట్టు డెక్కన్ ఛార్జర్స్ (ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్). ఫైనల్ లో ఆర్సీబీని ఓడించిన డీసీ.. సగర్వంగా కప్ కొట్టింది. అప్పుడు ఆడమ్ గిల్ క్రిస్ట్ ఛార్జర్స్ సారథిగా ఉన్నాడు.
- 2010లో ముంబై ఇండియన్స్ తో జరిగిన ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచి తొలిసారి ట్రోఫీని నెగ్గింది. సీఎస్కే సారథి ధోని.
- 2011లో కూడా చెన్నై సూపర్ కింగ్స్.. ఆర్సీబీని ఓడించి రెండో టైటిల్ కొట్టింది.
- 2012లో గౌతం గంభీర్ సారథ్యంలోని కోల్కతా నైట్ రైడర్స్.. ఫైనల్ లో చెన్నైని ఓడించి తొలి టైటిల్ నెగ్గింది.
- 2013లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.. ఐపీఎల్ లో టైటిల్ వేటను మొదలుపెట్టింది. ఈ సారి ముంబై.. ఫైనల్ లో చెన్నైని ఓడించి తొలి ట్రోఫీని అందుకుంది.
- 2014లో గౌతం గంభీర్ నేతృత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్.. ఫైనల్స్ లో కింగ్స్ లెవన్ పంజాబ్ లను ఓడించి రెండోసారి టోర్నీ విజేతగా నిలిచింది.
- 2015లో మళ్లీ ముంబై ఇండియన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్యే తుది పోరు. విజేత మళ్లీ ముంబై ఇండియన్సే. రోహిత్ తన ఖాతాలో రెండో ట్రోఫీ వేసుకున్నాడు.
- 2016లొ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఆర్సీబీని ఓడించి భాగ్యనగర అభిమానులకు రెండో ట్రోఫీని అందించింది. ఈసారి ఎస్ఆర్హెచ్ సారథి డేవిడ్ వార్నర్.
- రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.. 2017లో రైజింగ్ పూణె జెయింట్స్ తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ లో ఒక్క పరుగు తేడాతో గెలిచి మూడో టైటిల్ ను గెలిచింది.
- 2018లో ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్.. సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి మూడో కప్ కొట్టింది.
- 2019లో మళ్లీ ముంబై ఇండియన్సే.. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో గెలిచి నాలుగో టైటిల్ ను అందుకుంది.
- 2020లో కూడా ముంబై ఇండియన్స్ .. ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించి ఐదోసారి విజేతగా నిలిచింది.
- 2021లో చెన్నై సూపర్ కింగ్స్.. కోల్కతా నైట్ రైడర్స్ ను ఓడించి నాలుగో టైటిల్ ను సొంతం చేసుకుంది.
- 2022లో గుజరాత్ టైటాన్స్ - రాజస్తాన్ రాయల్స్ లు ఫైనల్స్ చేరాయి. ఫైనల్స్ లో రాజస్తాన్ ను గుజరాత్.. ఏడు వికెట్ల తేడాతో ఓడించి ఆడిన తొలి సీజన్ లోనే విజయాన్ని అందుకుంది.