IPL 2023: ఐపీఎల్ లో  మరో హలో బ్రదర్ స్టోరీ వచ్చింది.  ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో డువాన్ జాన్సేన్  అరంగేట్రం చేశాడు. 

ముంబై ఇండియన్స్ - కోల్కతా నైట్ రైడర్స్ మధ్య వాంఖెడే వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 22వ లీగ్ మ్యాచ్ లో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు, టీవీలు, మొబైల్ తెరల ముందు మ్యాచ్ చూస్తున్న కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు జాన్సేన్ జంట షాకిచ్చింది. టీవీ తెరల మీద జాన్సేన్ ను చూడగానే అందరూ షాకయ్యారు. ‘అరే.. ఇదేంటి..? సన్ రైజర్స్ లో ఆడాల్సిన మార్కో జాన్సేన్ ముంబై ఇండియన్స్ లో ఆడుతున్నాడేంటి..? ఇలా ఆడేందుకు బీసీసీఐ ఏమైనా కొత్త నిబంధన తీసుకొచ్చిందా..?’ అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ చాలా సేపు సస్పెన్స్ తర్వాత గానీ వారికి విషయం అర్థం కాలేదు. అక్కడున్నది. జాన్సేనే. కానీ మార్కో జాన్సేన్ కాదు. డువాన్ జాన్సేన్. వీళ్లిద్దరిదీ హాలో బ్రదర్ స్టోరీనే.. 

ఐపీఎల్ లో ఈ హలో బ్రదర్ స్టోరీలు ఇదే కొత్తకాదు. ‘పఠాన్’ ల కాలం కంటే ముందే ‘మెక్ కల్లమ్’లు, ‘పాండ్యా’లు, ‘మార్ష్’లు ఉన్నారు. ఈ జాబితాలో తాజాగా ‘జాన్సేన్’లు యాడ్ అయ్యారు. ఆ జాబితా ఒకసారి తిరగేద్దాం. 

- ఐపీఎల్ లో ఫస్ట్ ఆడిన సోదరుల జంట ఇర్ఫాన్ పఠాన్ - యూసుఫ్ పఠాన్. 2008 సీజన్ నుంచే వీళ్లిద్దరూ తమ తమ ఫ్రాంచైజీలకు ఆడారు. ‘పఠాన్’ ల జోడీ ఐపీఎల్ లోనే కాదు. భారత్ కు ఐసీసీ ట్రోఫీ అందించిన వారిలో కూడా ఉన్నారు. ఇర్ఫాన్.. 2008లో కింగ్స్ లెవన్ పంజాబ్ కు ఆడగా యూసుఫ్.. రాజస్తాన్ రాయల్స్ కు ఆడాడు. 

- ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతున్న మిచెల్ మార్ష్ సోదరుడు షాన్ మార్ష్ కూడా హలో బ్రదర్ స్టోరీనే. 2008 సీజన్ లో పంజాబ్ కు ఆడిన షాన్ మార్ష్..తొలి సీజన్ లో అత్యధిక పరుగులు (616) చేసిన బ్యాటర్ గా ఉన్నాడు. మిచెల్ 2022 నుంచి ఢిల్లీలో కొనసాగుతున్నాడు.

- ఐపీఎల్ లో ఫస్ట్ హండ్రెడ్ చేసిన మెక్ కల్లమ్ కోల్కతా కు ఆడగా అతడి సోదరుడు నాథన్ మెక్‌కల్లమ్ పూణె వారియర్స్ కు ఆడాడు. 

- చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ తో పాటు అతడి సోదరుడు డేవిడ్ హస్సీ కూడా ఐపీఎల్ లో భాగమయ్యారు. మైక్ హస్సీ ముంబై, చెన్నైలకు ఆడగా డేవిడ్.. పంజాబ్, కేకేఆర్ కు ఆడాడు.

- చెన్నైకి బౌలింగ్ కోచ్ గా ఉన్న దిగ్గజ ఆటగాడు డ్వేన్ బ్రావో తో పాటు అతడి సోదరుడు డారెన్ బ్రావో కూడా కలిసి ఐపీఎల్ ఆడినవారే. 

- ఈ జాబితాలో అందిరికీ తెలిసిన సోదరుల ద్వయం హార్ధిక్ పాండ్యా - కృనాల్ పాండ్యా. ఈ ఇద్దరూ ముంబై ఇండియన్స్ కు ఆడినవారే. ఇప్పుడు హార్ధిక్ గుజరాత్ కు, కృనాల్ లక్నోకు ఆడుతున్నారు. 

- ఐపీఎల్ లో అత్యధిక ధర పలికిన ఆటగాడు సామ్ కరన్. ప్రస్తుతం పంజాబ్ కు ఆడుతున్న సామ్ కరన్ సోదరుడు టామ్ కరన్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ లకు ఆడాడు. 

- భారత క్రికెట్ సోదరులు సిద్ధార్థ్ కౌల్, ఉదయ్ కౌల్ లు కూడా ఐపీఎల్ లో హలో బ్రదర్ స్టోరీనే. 

- సౌతాఫ్రికా ఆల్ రౌండర్ ఆల్బీ మోర్కెల్, మోర్నీ మోర్కెల్ లు ఈ కోవలోకి చెందినవారే. మోర్నీ మోర్కెల్ ప్రస్తుతం లక్నో కోచింగ్ సిబ్బందిలో ఉన్నాడు. ఆల్బీ చెన్నై కి ఆడాడు. 

- ప్రస్తుతం మార్కో జాన్సేన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడుతుండగా.. డువాన్ జాన్సేన్ ముంబైలో ఉన్నాడు. కాగా ఐపీఎల్ -16లో ముంబై - హైదరాబాద్ మ్యాచ్ ఈనెల 18న జరుగనుంది. ఈ మ్యాచ్ లో ఈ ఇద్దరూ ఆడితే ఆ దృశ్యం టాక్ ఆఫ్ ది టౌన్ అవడం ఖాయం.. 

Scroll to load tweet…