IPL 2023: వార్నర్ ఐపీఎల్ లో ఆడిందే ఆట పాడిందే పాట.   తన ఆటతో పాటు  ఆట పాటలు, హావభావాలతో అలరించే   వార్నర్  భాయ్.. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు సారథిగా వ్యవహరించనున్నాడు.

ఐపీఎల్ అంటేనే వినోదాల పండుగ. ఆటతో పాటు మరెన్నో ఎమోషన్స్ ఇందులో కలబోసి ఉంటాయి. సాధారణ ఆటగాళ్లే ఐపీఎల్ లో ఛాన్స్ దొరికినందుకు ఎగిరి గంతేస్తారు. ఇక ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ వంటి ప్లేయర్ కు ఇదొక రంగస్థలం. వార్నర్ ఐపీఎల్ లో ఆడిందే ఆట పాడిందే పాట. తన ఆటతో పాటు ఆట పాటలు, హావభావాలతో అలరించే వార్నర్ భాయ్.. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు సారథిగా వ్యవహరించనున్నాడు. ఫీల్డ్ లో ప్రేక్షకుల ముందు నానా రచ్చ చేసే వార్నర్.. తాజాగా ఈ సీజన్ మొదలుకాకముందే ఆ మూడ్ ను తీసుకొస్తున్నాడు.

ఈ సీజన్ కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ నిర్వహించిన ఫోటో షూట్ సందర్భంగా వార్నర్.. ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న ‘కామ్ డౌన్’ పాటకు స్టెప్పులేశాడు. డీసీ జెర్సీ వేసుకుని ఫోటో షూట్ మధ్యలో తన డాన్స్ ప్రతిభను చూపించాడు. 

కామ్ డౌన్ పాటకు స్టెప్పులేసిన వీడియోను వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. వీడియోను షేర్ చేస్తూ.. ‘షూడ్ డేస్ ఆర్ లైక్ ఫన్’అని రాసుకొచ్చాడు. వార్నర్ భాయ్ ఈ వీడియోను నెట్టింట అప్ లోడ్ చేయగానే వైరల్ అయింది. తాజాగా ఈ వీడియోపై వార్నర్ భార్య క్యాండీ వార్నర్ స్పందించింది.. ‘బయట ఇంత బాగా డాన్స్ చేస్తావ్.. నా ముందు ఎందుకిలా చేయవ్ నువ్వు..? ’అని రాసుకొచ్చింది. 

View post on Instagram

కాగా వార్నర్ భాయ్ పెట్టిన ఈ పోస్టుపై పలువురు తెలుగు అభిమానులు కూడా స్పందిస్తున్నారు. ‘డేవిడ్ అన్నా నువ్వు కింగ్ వి..’, ‘ఆటలో నువ్వు ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయేమో గానీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయడంలో నిన్ను మించినోడు లేడన్న..’, ‘అన్నా.. ఇప్పటికీ మించిపోయింది లేదు. నువ్వు మా టాలీవుడ్, బాలీవుడ్ లో ఎందుకు ట్రై చేయకూడదు..’, ‘నాటు నాటు ఎప్పుడేస్తున్నావన్నా.. దాని కోసం వెయిటింగ్ ఇక్కడ..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ కంటే ముందు 2016 నుంచి 2021 దాకా వార్నర్.. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వార్నర్ తెలుగు డైలాగులు చెప్పడం, తెలుగు పాటలతో పాటు బాలీవుడ్ ఫేమస్ సాంగ్స్ కు ఫేస్ ఆప్ ద్వారా డాన్సులు చేయడం వంటివాటితో ఫుల్ ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా బన్నీ నటించిన పలు సినిమాల డైలాగులను అంతర్జాతీయం చేసిన ఘనత వార్నర్ కే దక్కుతుంది.

ఇక ఈ సీజన్ లో రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదంతో ఈ సీజన్ లో డేవిడ్ వార్నర్ కు సారథ్య పగ్గాలు అప్పజెప్పిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఢిల్లీ తమ తొలి మ్యాచ్ ను లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడనుంది. ఇప్పటికే ట్రైనింగ్ క్యాంప్ లో ఉన్న ఢిల్లీ ఈసారి కప్ కొట్టాలనే పట్టుదలతో ఉంది.