నరాలు తెగే ఉత్కంఠ.. సీఎస్కే గెలిచాక రచ్చ రచ్చ.. చెన్నై ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ రూటే సెపరేటు..!
IPL 2023 Final: ఐపీఎల్లో ఐదో టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఇక నిన్న గుజరాత్ ను ఓడించాక తాలా ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు.
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ ఐదో టైటిల్ ను సొంతం చేసుకుంది. నిన్న రాత్రి గుజరాత్ టైటాన్స్తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ - 16 ఫైనల్స్ లో చెన్నై.. ఆఖరి బంతికి విజయం సాధించి ఐదో టైటిల్ ను అందుకుంది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లతో పాటు స్టేడియం వద్ద ఉన్న వేలాది అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
ఇక టీవీలు, మొబైల్స్ లలో చూసిన అభిమానులు.. జడేజా లాస్ట్ బాల్ కు సిక్సర్ కొట్టిన తర్వాత చేసిన రచ్చ మామూలుగా లేదు. చెన్నై ఫైనల్ చేరడంతో తమిళనాడులోని చెన్నై మెట్రో రైల్వే స్టేషన్లు, పబ్స్, హోటల్స్, బస్ స్టేషన్స్, హాస్టల్స్ లో ఈ మ్యాచ్ ను లైవ్ టెలికాస్ట్ చేశారు.
మోహిత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో ఉత్కంఠ పీక్స్ కు చేరిన తర్వాత.. చెన్నై ఫ్యాన్స్ ముఖాల్లో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపించింది. ఇక ఆఖరు బంతికి జడ్డూ ఫైన్ లెగ్ దిశగా బౌండరీ బాదగానే అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీకి ఐదో టైటిల్ దక్కగానే చెన్నైలోని మెట్రో స్టేషన్, హాస్టల్స్, ఇళ్లలో సంతోషాలు వెల్లివిరిశాయి.
కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ అయితే చెన్నై గెలిచినాక చిత్ర విచిత్రంగా ప్రవర్తించారు. ఓ వీడియోలో ఓ వ్యక్తి.. మోహిత్ లాస్ట్ బాల్ వేసే ముందు అమ్మవారికి మొక్కులు మొక్కుతూ.. ‘అమ్మా.. అమ్మా.. ధోనికి లాస్ట్ మ్యాచ్ అమ్మ. కరుణించు తల్లి..’ అని వేడుకోవడం ఆ వెంటనే జడ్డూ ఫోర్ కొట్టడంతో అతడు ఆనందం పట్టలేకపోయాడు. మరో వీడియోలో హాస్టల్ లో ఓ కుర్రాడు చెన్నై గెలిచాక రూమ్ లో ఉండే కప్ బోర్డ్, మెయిన్ డోర్ తలుపులను అటూ ఇటూ బాదుతూ.. కాంతారాలో అరిచినట్టు చిత్ర విచిత్రమైన అరుపులతో సెలబ్రేట్ చేసుకున్నాడు. మెట్రో రైల్వే స్టేషన్ లో కూడా ఫ్యాన్స్.. చెన్నై గెలిచాక నానా రచ్చ చేశారు.
ఓ వీడియోలో అయితే 70-80 సంవత్సరాల వయసుండే ఓ ముసలావిడ.. సీఎస్కే మ్యాచ్ గెలిచాక ఎగిరిగంతేసింది. హైదరాబాద్ లో కూడా డీఎల్ఎఫ్, అమీర్ పేట లో సీఎస్కే ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు.