హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల క్రికెట్ స్టేడియం మరింత అందగా  తయారైంది. 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల క్రికెట్ స్టేడియం మరింత అందగా తయారైంది. 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక్కడ 2013లో చివరి ఐపీఎల్ మ్యాచ్ జరగగా.. IPL 2023 సీజన్‌లో రెండు మ్యాచ్‌లకు వేదిక కానుంది. పంజాబ్ కింగ్స్ (PBKS) ధర్మశాల స్టేడియాన్ని వారి సెకండ్ హోం గ్రౌండ్‌గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ టీమ్ ఇక్కడ రెండు మ్యాచ్‌లను ఆడనుంది. మే 17న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 19న రాజస్తాన్ రాయల్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. 

ఈ నేపథ్యంలో సుందరంగా ముస్తాబైన ధర్మశాల క్రికెట్ స్టేడియం విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.. హిమాచల్ ప్రదేశ్‌లోని అందమైన కాంగ్రా లోయలో ఉన్న ధర్మశాల క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ మ్యాచ్‌లకు ప్రసిద్ధ వేదిక. ఈ స్టేడియం చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తోంది. గతంలో IPL మ్యాచ్‌లతో సహా అనేక ఉన్నత స్థాయి మ్యాచ్‌లకు ఈ స్టేడియం వేదికగా నిలిచింది. 

9 ఏళ్ల విరామం తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లకు వేదికగా నిలవనున్న ధర్మశాల స్టేడియం.. ప్రపంచంలోనే సరికొత్త డ్రైనేజీ వ్యవస్థను కలిగి ఉంది. అదే సమయంలో అత్యాధునిక సబ్ ఎయిర్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. తరచుగా వర్షాలు కురిసే ప్రాంతంలో ఉన్న ధర్మశాల క్రికెట్ స్టేడియం.. తడి మైదానాల కారణంగా మ్యాచ్‌లు ఆలస్యం కాకుండా ఉండేందుకు హెచ్‌పీసీఏ ఈ ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ ద్వారా వర్షం పడిన తర్వాత 20 నిమిషాలలో పిచ్‌ను పొడిగా మార్చేందుకు వీలు కలుగుతుంది. 

Scroll to load tweet…

బెంగళూరులోని కేఎస్‌సీఏ స్టేడియం తర్వాత దేశంలో ఈ వ్యవస్థను కలిగి ఉన్న రెండో స్టేడియంగా.. ధర్మశాల స్టేడియం నిలిచింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో మ్యాచ్‌ వేదికను ధర్మశాల క్రికెట్ స్టేడియం నుంచి మార్చిన తర్వాత స్టేడియంలోని పిచ్ ఇటీవల తిరిగి సిద్దం చేశారు.