IPL 2023: గురువారం  ఈడెన్ గార్డెన  వేదికగా  కోల్కతా నైట్ రైడర్స్  - రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో  రెండు పరుగులతో సెంచరీ మిస్ అయ్యాడు యశస్వి జైస్వాల్.. 

కోల్కతా - రాజస్తాన్ మధ్య నిన్న రాత్రి ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన వన్ సైడెడ్ థ్రిల్లర్ లో రాజస్తాన్ బంపర్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్ 13.1 ఓవర్లలోనే టార్గెట్ అందుకుంది. ఈ మ్యాచ్ లో రాజస్తాన్ ఓపెనర్ జైస్వాల్ 13 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసి మొత్తంగా 47 బంతుల్లోనే 13 బౌండరీలు, ఐదు భారీ సిక్సర్ల సాయంతో 98 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ లో జైస్వాల్ సెంచరీని అడ్డుకున్నాడని కేకేఆర్ స్పిన్నర్ సుయాశ్ శర్మపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

13వ ఓవర్ వేసిన సుయాశ్.. శాంసన్ క్రీజులో ఉండగా అతడికి లెగ్ సైడ్ చాలా దూరం బాల్ వేశాడు. కానీ శాంసన్ దానిని వైడ్ వెళ్లకుండా తన కాలితో అడ్డుకుని జైస్వాల్ కు బ్యాటింగ్ ఇచ్చాడు. అప్పటికీ రాజస్తాన్ విజయానికి 3 పరుగులే అవసరం కాగా శార్దూల్ వేసిన మరుసటి ఓవర్లో యశస్వి బ్యాటింగ్ తీసుకున్నాడు. 

యశస్వి 94 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఒకవేళ సిక్సర్ కొట్టి ఉంటే యశస్వి ఈ సీజన్ లో మరో సెంచరీ చేసుండేవాడు. కానీ అతడు ఫోర్ కొట్టడంతో అతడి స్కోరు 98 పరుగుల వద్దే ఆగిపోయింది. అంతా బాగానే ఉన్నా సుయాశ్ మాత్రం కావాలనే వైడ్ బాల్ వేశాడని, యశస్వి సెంచరీ చేయకుండా అడ్డుకునేందుకు ఇలా చేశాడని సోషల్ మీడియాలో లొల్లి మొదలైంది. 

Scroll to load tweet…

దీనిపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సుయాశ్ చర్యను తప్పుబట్టాడు. భారత్ - పాక్ మ్యాచ్ లో కోహ్లీ కూడా ఇలాగే 94 పరుగుల వద్ద ఉండి ఉంటే అప్పుడు పాకిస్తాన్ బౌలర్ ఎవరైనా అతడి సెంచరీని అడ్డుకునేందుకు ఇలా చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండని ట్వీట్ చేశాడు. సుయాశ్ చర్యను తప్పుబట్టాడు. ఇప్పుడు ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరో ట్వీట్ లో చోప్రా.. యశస్వి త్వరలోనే భారత జట్టులోకి వస్తాడని చోప్రా అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ప్రదర్శనలే కాదని, దేశవాళీలో కూడా అతడు పరుగులు సాధిస్తున్న విధానం చూసినా అతడికి టీమిండియాకు ఆడే అర్హత ఉందని చెప్పుకొచ్చాడు.