IPL 2022 Qualifier 2: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్... సీజన్ రెండో ఫైనలిస్ట్ ఎవరంటే..
IPL 2022 Qualifier 2: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్... ఐపీఎల్ 2022 సీజన్లో రెండోసారి టాస్ గెలిచిన సంజూ శాంసన్...
ఐపీఎల్ 2022 సీజన్ రెండో క్వాలిఫైయర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్తో తలబడుతోంది. ఆర్సీబీ, ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో గెలిచి రెండో క్వాలిఫైయర్కి అర్హత సాధించింది. మొదటి క్వాలిఫైయర్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ ఫైట్కి చేరేందుకు మరో అవకాశంగా నేటి మ్యాచ్ ఆడుతోంది... నేటి మ్యాచ్లో గెలిచిన జట్టు, మే 29న గుజరాత్ టైటాన్స్తో టైటిల్ జరిగే ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది...
నేటి మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఐపీఎల్ 2022 సీజన్లో 13 టాస్లు ఓడిన సంజూ శాంసన్, సీజన్లో టాస్ గెలవడం ఇది రెండోసారి. క్వాలిఫైయర్ 1లో రెండోసారి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఈజీ విక్టరీని అందుకోగా ఎలిమినేటర్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి విజయం దక్కింది. దీంతో నేటి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, వానిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హజల్వుడ్, మహ్మద్ సిరాజ్
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, దేవ్దత్ పడిక్కల్, సిమ్రాన్ హెట్మయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్కాయ్, యజ్వేంద్ర చాహాల్
మూడుసార్లు ఫైనల్ ఆడిన ఆర్సీబీ, 2016 తర్వాత క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడడం ఇదే తొలిసారి. 2008లో టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్, క్వాలిఫైయర్ మ్యాచ్ దాకా రావడం కూడా ఇదే తొలిసారి...
లీగ్ స్టేజీలో ఇరు జట్లు రెండు సార్లు తలబడగా ఒక్కో మ్యాచ్లో విజయం సాధించాయి. ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్, నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది...
జోస్ బట్లర్ 47 బంతుల్లో 6 సిక్సర్లతో 70 పరుగులు చేయగా దేవ్దత్ పడిక్కల్ 37, హెట్మయర్ 42 పరుగులు చేశారు. లక్ష్యఛేదనలో ఫాఫ్ డుప్లిసిస్ 29, అనుజ్ రావత్ 26, విరాట్ కోహ్లీ 5, డేవిడ్ విల్లే డకౌట్, రూథర్ఫర్డ్ 5 వికెట్లను త్వరగా కోల్పోయింది ఆర్సీబీ...
అయితే షాబాజ్ అహ్మద్ 26 బంతుల్లో 45, దినేశ్ కార్తీక్ 23 బంతుల్లో 44 పరుగులు చేసి మ్యాచ్ని ముగించారు. అయితే ఆర్ఆర్తో జరిగిన రెండో మ్యాచ్లో చిత్తుగా ఓడింది ఆర్సీబీ. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 56 పరుగులతో నాటౌట్గా నిలిచాడు...
అయితే స్వల్ప లక్ష్యఛేదనలో ఆర్సీబీ 19.3 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కుల్దీప్ సేన్ 4 వికెట్లు తీయగా అశ్విన్ 3, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు.. దీంతో ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగే మూడో మ్యాచ్... ఐపీఎల్ 2022 రెండో ఫైనలిస్టుని డిసైడ్ చేయనుంది...