ఐపీఎల్ కెరీర్‌లో 46వ హాఫ్ సెంచరీ నమోదు చేసిన శిఖర్ ధావన్... 6 వేల పరుగులు పూర్తి... చెన్నై సూపర్ కింగ్స్‌ ముందు 188 పరుగుల భారీ టార్గెట్...

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 180 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్, సీజన్‌లో రెండో ఫైట్‌లో మరో 7 పరుగులు అదనంగా చేర్చి... 188 పరుగుల టార్గెట్‌ను ప్రత్యర్థి ముందు పెట్టింది... శిఖర్ ధావన్ అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగి పంజాబ్ కింగ్స్‌కి మంచి స్కోరు అందించాడు. 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 21 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసి మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో దూబేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మయాంక్, శిఖర్ ధావన్ ఇద్దరూ స్లోగా ఇన్నింగ్స్ మొదలెట్టడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 37 పరుగులు మాత్రమే చేయగలిగింది పంజాబ్ కింగ్స్...


ఆ తర్వాత ఐపీఎల్‌లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్న శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు... విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో 6402 పరుగులు చేసి టాప్‌లో ఉండగా శిఖర్ ధావన్ 6 వేలకు పైగా పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ 5746 పరుగులతో, డేవిడ్ వార్నర్ 5668 పరుగులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు...

2017లో శిఖర్ ధావన్ 3300+ పరుగులతో ఉన్న సమయంలో రోహిత్ శర్మ దాదాపు 4 వేల పరుగులు (3986) పరుగులు చేయగా... నాలుగేళ్ల తర్వాత గబ్బర్ 6 వేల పరుగులు చేరగా... రోహిత్ అతనికి 300 పరుగుల దూరంలో నిలవడం విశేషం.. 

అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌పై 1000+ పరుగులు పూర్తి చేసుకున్న శిఖర్ ధావన్, ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. సీఎస్‌కేపై 1029 పరుగులతో టాప్‌లో నిలవగా, రోహిత్ శర్మ, కేకేఆర్‌పై 1018 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్, పంజాబ్ కింగ్స్‌పై 1005 పరుగులు చేసి తర్వాతి స్థానాల్లో ఉన్నారు...

అలాగే సీఎస్‌కేతో మ్యాచ్‌లో 11 పరుగుల వద్ద టీ20 క్రికెట్‌లో 9 వేల పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు శిఖర్ ధావన్... టీమిండియా తరుపున 68 టీ20 మ్యాచులు ఆడిన ధావన్, 1759 పరుగులు చేశాడు. టీమిండియా తరుపున విరాట్ కోహ్లీ టీ20ల్లో 10392 పరుగులు చేసి టాప్‌లో ఉండగా రోహిత్ శర్మ 10048 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. 

శిఖర్ ధావన్, భనుక రాజపక్ష కలిసి మూడో వికెట్‌కి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేసిన రాజపక్ష, బ్రావో బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 

7 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 19 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్ కూడా బ్రావో బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 3 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన బెయిర్‌స్టో.. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు.

59 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 88 పరుగులు చేసిన శిఖర్ ధావన్ నాటౌట్‌గా నిలిచాడు.