IPL 2021: ఆ ముగ్గురు క్రికెటర్లకు గురువుగా విరాట్ కోహ్లి.. నెక్స్ట్ టార్గెట్ టీమ్ ఇండియాలోకేనా..?
Virat Kohli As Mentor: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి నయా అవతారం ఎత్తాడు. త్వరలో టీ20 క్రికెట్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్న కోహ్లి.. టీమ్ ఇండియాలోకి రావాలనుకుంటున్న ముగ్గురు కీ ప్లేయర్లకు మెంటార్ గా మారాడు. ఎవరు వాళ్లు..? ఏంటా కథా కమామీషు..?
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కొత్త అవతారం ఎత్తాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ప్లే ఆఫ్స్ కు చేర్పించే పనిలో పడ్డ భారత సారథి.. భారత జట్టులోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న ముగ్గురు యంగ్ క్రికటర్లకు గురువుగా మారాడు. బ్యాటింగ్ లో వారికి మెలుకువలు నేర్పించడంతో పాటు ఒత్తిడిని ఎలా అధిగమించాలో చెబుతున్నాడు. ఆ ముగ్గరు యువ క్రికెటర్లు.. దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్, వెంకటేశ్ అయ్యర్.
గత కొంతకాలంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్.. ఆర్సీబీ తరఫునే గాక కర్నాటక టీమ్ లోనూ కీలక ప్లేయర్ గా మారాడు. తన ఎదుగుదలకు కోహ్లి కూడా కారణమంటాడు పడిక్కల్. కోహ్లితో కలిసి ఆర్సీబీ ఇన్నింగ్స్ ఓపెన్ చేసే అవకాశం దక్కించుకున్నపడిక్కల్.. గ్రౌండ్ లోనే గాక ఆఫ్ ది ఫీల్డ్ లోనూ కోహ్లిని గురువుగా భావిస్తాడు. కోహ్లితో కలిసి ఓపెనింగ్ పంచుకోవడంతో తన బ్యాటింగ్ మరింత మెరుగుపడిందని అంటాడు ఈ కర్నాటక ఓపెనర్.
ఈ ఐపీఎల్ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున అదరగొడుతున్న వెంకటేష్ అయ్యార్ కూడా కోహ్లి నుంచి బ్యాటింగ్ పాఠాలు నేర్చుకున్నానని చెప్పాడు. ఐపీఎల్ ఫేజ్ 2 సందర్భంగా.. కోహ్లితో కలిసి అయ్యర్ కలిసున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరలైంది. కోహ్లి తనకు విలువైన పాఠాలు బోధించాడని అయ్యర్ చెప్పుకొచ్చాడు. అవి తన కెరీర్ కు కచ్చితంగా ఉపయోగపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ప్రస్తుత ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున దుమ్మురేపుతున్న ఆటగాడు యశస్వి జైస్వాల్. పలు సంచలన ఇన్నింగ్స్ లతో ఇరగదీస్తున్న జైస్వాల్.. కోహ్లి భయ్యా తనకు గురువుతో సమానమని ఇటీవలే వ్యాఖ్యానించాడు. తక్కువ స్కోర్లకు ఔటవుతున్న తనకు.. వాటిని భారీ స్కోర్లుగా ఎలా మలుచుకోవాలో విరాట్ టిప్స్ చెప్పాడని అన్నాడు. కోహ్లి చెప్పిన టిప్స్ ప్రస్తుతం తనకు, తన జట్టుకు లాభిస్తున్నాయని ఈ యంగ్ ప్రామిసింగ్ ప్లేయర్ తెలిపాడు. బ్యాటింగ్ మెలుకువలతో పాటు మ్యాచ్ లో పాజిటివ్ గా ఎలా ఉండాలో కోహ్లి చెప్పాడని జైస్వాల్ వివరించాడు.
ఏదేమైనా త్వరలోనే టీ20 కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న కోహ్లి.. యువ ఆటగాళ్లకు క్రికెట్ గురించి మెళకువలు నేర్పుతుండటం శుభపరిణామం. ఐపీఎల్ లో అదరగొడుతున్న ఈ ముగ్గురూ.. త్వరలోనే టీమ్ ఇండియాలోకి అడుగుపెట్టిన ఆశ్యర్యం లేదని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. కాగా, త్వరలో జరుగబోయే టీ20 వరల్డ్ కప్ కు భారత జట్టుకు మహేంద్ర సింగ్ ధోని మెంటార్ గా నియమితుడైన విషయం తెలిసిందే. ధోని కంటే ముందు కోహ్లి ఆ పాత్రను ఐపీఎల్ లో పోషిస్తుండటం యువ ఆటగాళ్లకు కలిసి వస్తున్నది.