‘నీవల్లే ఐపీఎల్ ఆగిపోయింది. నువ్వు చనిపోయినా బాగుండు అని మెసేజ్ చేశారు’.. వరుణ్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
Varun Chakravarthy: కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు వరుణ్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గతేడాది ఐపీఎల్ సందర్భంగా తనకు కరోనా రావడంతో చాలా కుంగిపోయానని బాధపడ్డాడు.
ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు ముగిసి ప్లేఆఫ్స్ దశకు చేరుకున్నాయి. మరో మూడు మ్యాచ్ లు ఆడితే టోర్నీ ముగుస్తుంది. కాగా, భారత్ లో జరిగిన తొలి దశ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కోల్కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి వైరస్ సోకిన అనంతరం ఆ జట్టులోని ఇతర ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత దాని వ్యాప్తి పెరగడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆ టోర్నీని వాయిదా వేసింది. దీనిపై వరుణ్ చక్రవర్తి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
వరల్డ్ మెంటల్ హెల్త్ డే (అక్టోబర్ 10) సందర్భంగా కోల్కతా నైట్ రైడర్స్ ట్విట్టర్ లో ఒక వీడియో విడుదల చేసింది. ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ.. ‘నాకింకా గుర్తుంది. నా డాక్టర్ ఫోన్ చేసి నాకు కరోనా పాజిటివ్ అని చెప్పాడు,. దీంతో నేను వణికిపోయాను. జీవితం ఒక్కసారిగా తలకిందులైనట్టు అనిపించింది. కానీ నా కారణంగా సీజన్ వాయిదా పడుతుందని నేను అప్పుడు అనుకోలేదు. కరోనా వచ్చిన వెంటనే చాలా మంది నెటిజన్లు, ప్రజలు నాకు వ్యతిరేకంగా మాట్లాడారు. సామాజిక మాధ్యమాల వేదికగా నాకు వ్యతిరేకంగా మెసేజ్ లు పెట్టారు. వరుణ్ చక్రవర్తి చనిపోయినా బాగుండేది అని అందులో రాశారు. అవి చూడగానే చాలా కుంగిపోయా. ఒక్కోసారి ఒక్కడినే చాలా ఏడ్చేవాడిని’ అని అన్నాడు.
వరుణ్ తో పాటు కేకేఆర్ ప్లేయర్లు దినేశ్ కార్తీక్, నాయర్ లు ఇదే విషయమై మాట్లాడారు. అందులో వాళ్లు వరుణ్ కు మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియా కొంచెం దయకలిగి ఉండాలని కార్తీక్ అన్నాడు. సెలబ్రిటీలు ఏదైనా మాట్లాడితే కొందరు మీమ్స్, వీడియోలు, పోస్టుల ద్వారా ఇష్టమొచ్చినట్టు చేస్తారని, కానీ ఎదుటి మనిషి గురించి కనీసం ఆలోచించరని కార్తీక్ చెప్పాడు. వరుణ్ లాంటి ఆటగాళ్లపై సోషల్ మీడియా కాస్త సానుభూతి చూపించాలని నాయర్ అభిప్రాయపడ్డాడు.