మరోసారి ఐపీఎల్ను తాకిన కరోనా కలవరం... ఓ ప్లేయర్కి పాజిటివ్? నేటి మ్యాచ్పై ప్రభావం...
ఐపీఎల్ 2021 ఫేజ్ 2నూ వదలని కరోనా భూతం... సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్కి ముందు పరీక్షల్లో ఓ ప్లేయర్కి పాజిటివ్...
ఐపీఎల్ 2021 సీజన్ను మరోసారి కరోనా కలవరం తాకింది. ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కి ముందు నిర్వహించిన పరీక్షల్లో సన్రైజర్స్ హైదరాబాద్కి చెందిన ఓ ప్లేయర్ (విజయ్ శంకర్) కి కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం...
మిగిలిన ప్లేయర్లకు రెండు విడుతలు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తే, నేటి మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే భారత్లో నిర్వహించిన ఐపీఎల్ 2021 సీజన్లో 29 మ్యాచులు ముగిసిన తర్వాత కరోనా కేసులు వెలుగుచూడడంతో అర్ధాంతరంగా సీజన్ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
యూఏఈ వేదికగా నిర్వహించిన ఐపీఎల్ 2020 సీజన్లో కరోనా కేసులు లేకుండా మ్యాచులు సజావుగా జరగడంతో అక్కడే ఫేజ్ 2 నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి మూడు మ్యాచులు సజావుగా ముగిసిన తర్వాత నాలుగో మ్యాచ్ ఆరంభానికి ముందు మరోసారి కరోనా కలవరం మొదలైంది...
దీంతో ఈసారి బీసీసీఐ అధికారులు ఏం చేస్తారు? ఎలాంటి చర్యలు నిర్వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే భారత క్రికెటర్లు, మరో ఆరేడు నెలల పాటు వరుస సిరీస్లతో బిజీ షెడ్యూల్లో గడపబోతుండడంతో ఈసారి ఐపీఎల్ వాయిదా వేసేందుకు కూడా అవకాశం లేదు...