IPL 2021 MI vs RR: ఈజీ టార్గెట్ను ఊదేసిన ముంబై ఇండియన్స్... ప్లేఆఫ్ రేసు నుంచి రాజస్థాన్ అవుట్...
8.2 ఓవర్లలో మ్యాచ్ను ముగించిన ముంబై ఇండియన్స్... హాఫ్ సెంచరీతో ఫామ్లోకి వచ్చిన ఇషాన్ కిషన్... పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ముంబై...
ఐపీఎల్ 2021 సీజన్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కచ్ఛితంగా గెలవాల్సిన మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జూలు విదిల్చి, చెలరేగింది. తొలుత బౌలర్లు విజృంభించి, ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ను 90 పరుగులకే పరిమితం చేయగా... ఈజీ టార్గెట్ను 9 ఓవర్లలో లోపే ఊదేశారు ముంబై బ్యాట్స్మెన్...
రోహిత్ శర్మ 13 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 22 పరుగులు చేసి సకారియా బౌలింగ్లో అవుట్ కాగా, 8 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ను ముస్తాఫిజుర్ అవుట్ చేశాడు...
అయితే ఖాతా తెరవడానికి 7 బంతుల దాకా వేచి చూసిన ఇషాన్ కిషన్, 25 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి మ్యాచ్ను ముగించాడు. మరో ఎండ్లో హార్ధిక్ పాండ్యా 6 బంతుల్లో 5 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు...
ఈ విజయంతో 6 విజయాలను అందుకున్న ముంబై ఇండియన్స్, పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. అయితే ముంబై ప్లేఆఫ్స్ చేరాలంటే ఆఖరి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించాల్సి ఉంటుంది. అలాగే 7న జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో కేకేఆర్ ఓడిపోవాల్సి ఉంటుంది...
ఈ పరాజయంతో రాజస్థాన్ రాయల్స్ దాదాపు ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్నట్టే. కేకేఆర్తో జరిగే మ్యాచ్లో రాజస్థాన్ గెలిచి, సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోతే... రన్రేటు ఆధారంగా ప్లేఆఫ్ చేరే జట్టు నిర్ణయించబడుతుంది...
అయితే ఈ మ్యాచ్లో దారుణ వైఫల్యం కారణంగా రన్రేట్ ఘోరంగా పడిపోవడంతో ఏడో స్థానానికి పడిపోయిన రాజస్థాన్ రాయల్స్, ప్లేఆఫ్ చేరాలంటే కోల్కత్తా నైట్రైడర్స్ను చిత్తు చేస్తూ, ఘన విజయాన్ని నమోదుచేయాల్సి ఉంటుంది.