ఐపీఎల్ 2020: ధోనీ సేనను తేలిగ్గా తీసేసిన రోహిత్ శర్మ
ఐపిఎల్ 2020లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఈ రోజు జరిగే మ్యాచు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
అబూ దుబాయ్: అసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ సమరం ఈ రోజు ప్రారంభం కానుంది. తొలి మ్యాచులో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ను ఎదుర్కుంటోంది. మ్యాచు ఈ రోజు సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమవుతోంది.
మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేసింది. ప్రత్యర్థిని ఎదుర్కునే విషయంలో తాను చేస్తున్న ఆలోచనకు సంబంధించిన రోహిత్ శర్మ వీడియో అది.
చెన్నై సూపర్ కింగ్స్ ను ఎదుర్కోవడం ఎల్లవేళలా ఆనందం కలిగిస్తుందని ఆయన అంటూ ఆ జట్టును తేలిగ్గే తీసేశారు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు తమకు మరో ప్రత్యర్థి మాత్రమే మాత్రమేనని, ఆ విధంగానే తాము ముందుకు సాగుతామని ఆయన అన్నారు.
ఐపిఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు కూడా ఎక్కువ ఫలితాలు సాధించాయి. ముంబై ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ కాగా, చెన్నై మూడు సార్లు టైటిల్ గెలుచుకుంది.
ఈ రెండు జట్ల మధ్య మ్యాచు ఎప్పుడు కూడా ప్రత్యేకమేనని ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యా అన్నారు. ఈ మ్యాచు కోసం ప్రజలు ఎదురు చూస్తుంటారని ఆయన అన్నారు.