IPL 2020: కార్తీక్ చేసిన పని, ధోనీ ఎందుకు చేయలేకపోయాడు... మాహీపై విమర్శలు!
చిత్తుగా ఓడినా సాహసోపేత నిర్ణయంతో ప్రశంసలు పొందుతున్న దినేశ్ కార్తీక్...
హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన ధోనీ నిర్ణయాన్ని విమర్శిస్తున్న మాజీలు...
బ్యాటింగ్ ఆర్డర్లో ముందు రావడానికి ధోనీ భయపడ్డాడంటూ ట్రోల్స్...
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పోరాడి ఓడింది. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కత్తా నైట్రైడర్స్ ఏ మాత్రం పోరాడకుండానే 49 పరుగుల భారీ తేడాతో ఓడింది. అయితే ఈ రెండు మ్యాచుల్లో కెప్టెన్లు వ్యవహారించిన తీరు హాట్ టాపిక్ అయ్యింది. 217 పరుగుల భారీ టార్గెట్ చేధించడమంటే అంత తేలికయ్యే పని కాదు. కానీ భారీ హిట్టర్లు ఉన్న సీఎస్కే తలుచుకుంటే, అదేమీ అసాధ్యమయ్యే టార్గట్ కాదు.
అయితే క్రికెట్లో ‘వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషర్’గా పేరొందిన ధోనీ... ఎప్పుడు బ్యాటింగ్కి వస్తాడా? అని ఎదురుచూడాల్సి వచ్చింది. ఆఖరికి ఆరో వికెట్ పడిన తర్వాత తాపీగా క్రీజులోకి వచ్చాడు ధోనీ. ఓవర్కి 20 పరుగుల రన్రేట్ అవసరమైన టైమ్లో సింగిల్స్ తీస్తూ కాలక్షేపం చేశాడు. బాల్స్ వేస్ట్ చేసి... ఆఖర్లో ఓటమి ఖరారయ్యాక హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. అవి ఓటమి తేడాను తగ్గించడానికి తప్ప, జట్టుకు ఏ మాత్రం ఉపయోగపడలేదు.
మరోవైపు 196 పరుగుల భారీ టార్గెట్తో బరిలో దిగిన కోల్కత్తా, శుబ్మన్ గిల్ వికెట్ త్వరగా కోల్పోయింది. ఎప్పుడూ మిడిల్ ఆర్డర్లో లేదా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చే దినేశ్ కార్తీక్ వన్డౌన్లో వచ్చాడు. 23 బంతుల్లో 5 ఫోర్లతో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గేమ్ ఛేజింగ్ ఇన్నింగ్స్ కాకపోయినా భారీ టార్గెట్ చేధన కోసం బాధ్యత తీసుకుని టాప్ ఆర్డర్లోకి వచ్చని దినేశ్ కార్తీక్ ప్రశంసలు పొందాడు.
మరి దినేశ్ చేసిన పని, ధోనీ ఎందుకు చేయలేకపోయాడని విమర్శిస్తున్నారు సీనియర్లు.
ధోనీ, దినేశ్ కార్తీక్ దాదాపు ఒకే వయసు వారు. ఇద్దరూ 35+ దాటిన వాళ్లే. అయినా దినేశ్ కార్తీక్ డేర్ చేసి బ్యాటింగ్ ఆర్డర్లో ముందు వచ్చాడు, ధోనీ భయంతో వెనక్కి వెళ్లిపోయాడని ట్రోల్ చేస్తున్నారు. వన్డే వరల్డ్కప్లో గంభీర్, కోహ్లీ ఇన్నింగ్స్ కారణంగా దాదాపు విజయం ఖాయమైనప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ తీసుకున్న ధోనీ, ఇలాంటి భారీ స్కోరింగ్ మ్యాచ్లో ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోలేకపోయాడన్నది క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్న.