IPL 2020: ధోనీ తక్కువ అవుతున్నాడు, తక్కువ చేస్తున్నారు..
మాహీపై వస్తున్న విమర్శలు చూస్తుంటే... కొత్తతరం ధోనిని తక్కువగా ఊహించుకోవచ్చు...
ధోనీ హీరోగా నిరూపించుకోవాలంటే గేమ్ ప్లాన్ మార్చాలి...
మాజీ క్రికెటర్ అజయ్ జడేజా హాట్ కామెంట్స్...
IPL 2020: మహేంద్ర సింగ్... ఓ క్రికెట్ లెజెండ్. నేటితరంలో చాలామంది యంగ్ క్రికెటర్లకు మాహీ దేవుడితో సమానం. రెండు ప్రపంచకప్లతో పాటు భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించిన భారత మాజీ సారథి, ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన సారథిగా కూడా కొనసాగుతున్నాడు.
అయితే ఈ సీజన్లో జరిగిన మూడు మ్యాచుల్లోనూ ధోనీ బ్యాటు నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. కీపింగ్లో రాణిస్తున్నా, బ్యాటింగ్లో విఫలమవుతున్న మహేంద్ర సింగ్ ధోనీ... కెప్టెన్గానూ రైనా లేని సీఎస్కే జట్టుని నడిపించడంలో ఫెయిల్ అవుతున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ ఆటతీరుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించాడు భారత మాజీ ఆల్రౌండర్ అజయ్ జడేజా.
‘ధోనీ ఓ క్రికెట్ లెజెండ్. దాంట్లో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ఇప్పుడు ధోనీ ఆటతీరు, అతనిపై వస్తున్న విమర్శలు చూస్తుంటే... కొత్తతరం ధోనిని తక్కువగా ఊహించుకోవచ్చు... భవిష్యత్ తరంలో అతను హీరోగా మిగలాలంటే వెనక నుంచి పోరాడడం కాదు, ముందుకొచ్చి యుద్ధం చేయాల్సి ఉంటుంది...’ అని వ్యాఖ్యానించాడు అజయ్ జడేజా.