ఐపిఎల్ 2019: పంజాబ్ పై ప్రతీకారం తీర్చుకున్న ఢిల్లీ
ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై విజయం సాధించింది. తద్వారా ఈ ఐపీఎల్ సీజన్లో ఆరో విజయాన్ని దక్కించుకుంది.
న్యూఢిల్లీ: గత మ్యాచులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై ఓటమికి ఢిల్లీ క్యాపిటల్స్ శనివారం జరిగిన మ్యాచులో ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై విజయం సాధించింది. తద్వారా ఈ ఐపీఎల్ సీజన్లో ఆరో విజయాన్ని దక్కించుకుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. క్రిస్ గేల్ 37 బంతుల్లో 69 పరుగులు చేసి ఊపునిచ్చాడు. ఢిల్లీకి ఆడుతున్న నేపాల్కు చెందిన యువ స్పిన్నర్ సందీప్ లమిచానే 3 వికెట్లు తీశాడు.
తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి విజయం సాధించింది. శిఖర్ ధావన్ (41 బంతుల్లో 56 పరుగులు చేశాడు. కెప్టెన్ అయ్యర్ 49 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు.
ఢిల్లీపై జరిగిన మ్యాచులో పంజాబ్ బ్యాట్స్ మెన్ ల్లో క్రిస్ గేల్ ఒక్కడే సత్తా చాటాడు. మిగతా వారంతా దాదాపుగా చేతులెత్తేశారు. ఈ మ్యాచులో రాహుల్ (12) కూడా విఫలమయ్యాడు. మయాంక్ 2 పరుగులకే వెనుదిరిగాడు. డేవిడ్ మిల్లర్ 7 పరుగులే చేశాడు.
ఢిల్లీ బౌలర్లను ఆటాడుకున్న క్రిస్ గేల్ బౌండరీ లైన్కు వెంట్రుకవాసి దూరంలో అద్భుతమైన రిలే క్యాచ్తో అవుట్యాడు. అదే ఓవర్లో కరన్ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. ఆ తర్వాత మన్దీప్ సింగ్ 27 బంతుల్లో 30 పరుగులు చేయడం కాస్తా ఊరటనిచ్చింది. చివర్లో హర్ప్రీత్ 12 బంతుల్లో 20 పరుగులు చేయడంతో పంజాబ్ స్కోరు 150 దాటింది.
తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే పృథ్వీ షా (13) వికెట్ను కోల్పోయింది. పృథ్వీ షా ధావన్ కారణంగా రనౌట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ధావన్ బాధ్యతగా ఆడుతూ ఇన్నింగ్స్ను నడిపించాడు.కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్ట్రయిక్ రొటేట్ చేశాడు. దీంతో తొలి పది ఓవర్లలో ఢిల్లీ 95 పరుగులు చేసింది.
శిఖర్ ధావన్ ధావన్ 36 బంతుల్లో అర్ధసెంచరీని సాధించాడు. ఆతర్వాత విలోన్ బౌలింగ్లో మరో బౌండరీ బాదిన ధావన్ మరుసటి బంతికే రవిచంద్రన్ అశ్విన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఫలితంగా రెండో వికెట్కు 94 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పంత్ 6 పరుగులు మాత్రమే చేశాడు. చివరి మూడు ఓవర్లలో 23 పరుగులు చేయాల్సిన స్థితిలో ఇంగ్రామ్ చెలరేగి ఆడాడు. విలోన్ వేసిన 18 వ ఓవర్లో 3 ఫోర్లతో 13 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి ఓవర్లోనే షమీ అద్భుత బంతికి క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే అక్షర్ పటేల్ (1) రనౌట్గా వెనుదిరిగాడు.
మరోవైపు 45 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న శ్రేయాస్ అయ్యర్ రూథర్ఫర్డ్ తో కలిసి రెండు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ను ముగించి విజయాన్ని అందించాడు.