ఐపిఎల్ 2019: చెలరేగిన వాట్సన్, చెన్నై చేతిలో హైదరాబాద్ చిత్తు
ముందుగా బ్యాటింగ్ చేపట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. మనీశ్ పాండే వీరోచితంగా బ్యాటింగ్ చేసి 49 బంతుల్లో 3 సిక్స్ లు, 7 ఫోర్ల సాయంతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
చెన్నై: ఐపిఎల్ - 12 సీజన్ లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్పై ఘన విజయం సాధించింది. చెన్నై బ్యాటింగ్ ముందు హైదరాబాదు బౌలర్లు తేలిపోయారు.
ముందుగా బ్యాటింగ్ చేపట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. మనీశ్ పాండే వీరోచితంగా బ్యాటింగ్ చేసి 49 బంతుల్లో 3 సిక్స్ లు, 7 ఫోర్ల సాయంతో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఎప్పటిలాగే వార్నర్ చెలరేగి ఆడాడు. 45 బంతుల్లో 2 సిక్స్ లు, 3 ఫోర్లతో 57 పరుగులు చేశాడు.. హర్భజన్కు 2 వికెట్లు దక్కాయి.
తర్వాత 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్కింగ్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి గెలిచింది. వాట్సన్, రైనా చెలరేగి ఆడారు. వాట్సన్ (53 బంతుల్లో 6 సిక్స్ లు, 9 ఫోర్లతో 96 పరుగులు చేశాడు. రైనా 24 బంతుల్లో 38 పరుగులు సాధించాడు. భువీ, రషీద్ చెరో వికెట్ తీశారు. వాట్సన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
చెన్నై కూడా ఆరంభంలోనే ఓపెనర్ డు ప్లెసిస్ (1) వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత వాట్సన్, రైనా దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఖలీల్ అహ్మద్ వేసిన ఐదో ఓవర్లో వాట్సన్ వరుసగా 6, 4 కొడితే ఆ మరుసటి ఓవర్ వేసిన సందీప్ శర్మ బౌలింగ్లో రైనా 4, 0, 4, 4, 4, 6తో ఏకంగా 22 పరుగులు సాధించాడు.