ఆసీస్తో రెండో టీ20 మ్యాచ్... ఆఖరి ఓవర్ వరకూ పోరాడి ఓడిన టీమిండియా...
రెండో టీ20లో ఆసీస్ ఉత్కంఠ విజయం... 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా జట్టు... మూడు వికెట్లు తీసిన రాజేశ్వరి గైక్వాడ్...
ఆస్ట్రేలియా టూర్లో భారత మహిళా జట్టు, రెండో టీ20 మ్యాచ్లో పోరాడి ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేయగలిగింది.
టాపార్డర్ బ్యాటర్లు స్మృతి మంధాన 1, షెఫాలీ వర్మ 3, జెమీమా రోడ్రిగ్స్ 7, యషికా భాటియా 8, రిచా ఘోష్ 2 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచినా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 20 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేసింది...
లోయర్ ఆర్డర్లో దీప్తి శర్మ 16, పూజా వస్తాకర్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది టీమిండియా...119 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియాకి ఆరంభంలో గట్టి షాక్ తగిలింది.
వికెట్ కీపర్ ఆలీసా హేలీని 4 పరుగులకే బౌల్డ్ చేసింద శిఖా పాండే. కెప్టెన్ మెగ్ లానింగ్ 15, బెత్ మూనీ 34 పరుగులు చేయగా 96 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆసీస్ను తహిలా మెక్గ్రాత్ అద్భుత ఇన్నింగ్స్తో విజయాన్ని అందించింది...
33 బంతుల్లో 6 ఫోర్లతో 42 పరుగులు చేసిన తహిలా మెక్గ్రాత్కి తోడు జార్జియా వారేహం 7 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి ఆస్ట్రేలియాకి 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు... భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 4 ఓవరల్లో 21 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది.
ఇరుజట్ల మధ్య ఆఖరి టీ20 మ్యాచ్, ఆదివారం అక్టోబర్ 10న జరుగుతుంది. మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే..