India vs West Indies 2nd T20I: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్... తొలుత బ్యాటింగ్ చేయనున్న భారత జట్టు... 

భారత జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ కిరన్ పోలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. మొదటి టీ20 మ్యాచ్‌లో విండీస్ విధించిన లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత జట్టు. రోహిత్ శర్మ మెరుపు బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభం అందించాడు. అయితే రోహిత్ శర్మ ఇచ్చిన ఆరంభాన్ని విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ కంటిన్యూ చేయలేకపోయారు...

వరుసగా నాలుగు మ్యాచుల్లో 30+ స్కోర్ చేయలేకపోయిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపైనే అందరి ఫోకస్ పడింది. నేటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఎంత స్కోరు చేస్తాడు? కనీసం హాఫ్ సెంచరీ అయినా నమోదుచేయగలడా? అని ఎదురుచూస్తున్నారు ఆయన అభిమానులు... 100వ టెస్టుకి ముందు జరిగే ఈ మ్యాచ్‌ల్లో ఫామ్‌లోకి వస్తే, విరాట్ కోహ్లీ నూరో టెస్టులో మంచి జోష్ ఉంటుందని కోరుకుంటున్నారు...

కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రోహిత్ శర్మ బ్యాటింగ్ గేర్ మార్చి, పరుగులు చేస్తున్నాడు. విండీస్‌తో జరిగిన ఆఖరి రెండు వన్డేల్లో పెద్దగా పరుగులు చేయలేకపోయినా మొదటి టీ20లో 19 బంతుల్లో 40 పరుగులు చేసి చేయాల్సినంత డ్యామేజ్ చేసేసి, పెవిలియన్ చేరాడు...

వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా మొదటి టీ20లో తీవ్రంగా నిరాశపరిచాడు. పంత్ బ్యాటు నుంచి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు భారత అభిమానులు... ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన తర్వాత భారత జట్టులో చోటు కల్పించుకోలేకపోయాడు రుతురాజ్ గైక్వాడ్. కెఎల్ రాహుల్ గైర్హజరీతో అతనికి విండీస్‌తో టీ20 సిరీస్‌లో తప్పక అవకాశం దక్కుతుందని భావించారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌కే ఛాన్స్ ఇవ్వడంతో రుతురాజ్ గైక్వాడ్‌కి ఈసారి కూడా నిరాశ తప్పలేదు.

విండీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో 2 వికెట్లు తీయడమే కాకుండా పొదుపుగా బౌలింగ్ చేసి ఇంప్రెస్ చేశాడు యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్. ఆవేశ్ ఖాన్ వంటి యంగ్ పేసర్‌కి తుది జట్టులో అవకాశం దొరుకుతుందేమోనని ప్రచారం జరిగినా, మొదటి టీ20 మ్యాచ్ ఆడుతున్న జట్టులో మార్పులు చేయకుండా రెండో టీ20లో బరిలో దిగుతోంది భారత జట్టు... 

భారత పర్యటనలో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన వెస్టిండీస్, కనీసం ఈ మ్యాచ్ అయినా గెలిచి టీ20 సిరీస్‌ను ఉత్కంఠభరితంగా మార్చాలని ఆశ పడుతోంది. వెస్టిండీస్ కెప్టెన్ కిరన్ పోలార్డ్‌కి ఇది 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్....

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహార్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి భిష్ణోయ్, యజ్వేంద్ర చాహాల్

 వెస్టిండీస్ జట్టు:  బ్రెండన్ కింగ్, కేల్ మేయర్స్, నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్, కిరన్ పోలార్డ్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, ఓడియన్ స్మిత్, రోస్టన్ ఛేజ్, అకీల్ హుస్సేన్, రొమారియో షెఫర్డ్, షెల్డన్ కాట్రెల్