India vs West Indies 2nd T20I: హాఫ్ సెంచరీ చేసి అవుటైన విరాట్ కోహ్లీ... రిషబ్ పంత్ మెరుపు అర్ధ శతకం, అదరగొట్టిన వెంకటేశ్ అయ్యర్...

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ విఫలమైనా రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో రాణించడం, వెంకటేశ్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా మంచి స్కోరు చేయగలిగింది టీమిండియా... 

ఇషాన్ కిషన్ 10 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి కాట్రెల్ బౌలింగ్‌లో మేయర్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

విండీస్ ఫీల్డర్లు క్యాచ్ డ్రాప్ చేయడంతో రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ 18 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసి రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో బ్రెండన్ కింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు....

59 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 6 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 

41 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టీ20ల్లో 30వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. రోహిత్ శర్మ 30 హాఫ్ సెంచరీలతో టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉంటే, విరాట్ కోహ్లీ అతని రికార్డును సమం చేశాడు...

వెస్టిండీస్‌పై విరాట్ కోహ్లీకి ఇది ఆరో హాఫ్ సెంచరీ. టీ20ల్లో విండీస్‌పై అత్యధిక అర్ధ శతకాలు నమోదు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు విరాట్ కోహ్లీ...

సిక్సర్‌తో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న విరాట్ కోహ్లీ, ఆ తర్వాత రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 106 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది భారత జట్టు... రోస్టన్ ఛేజ్ 3 వికెట్లు తీసి టీమిండియాపై రెండో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 

ఆ తర్వాత యంగ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్, యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కి 35 బంతుల్లో 76 పరుగులు జోడించారు.

18 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, ఆఖరి ఓవర్ మూడో బంతికి షెఫర్డ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు... రిషబ్ పంత్ 28 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆఖరి 5 ఓవర్లలో 62 పరుగులు చేసిన భారత జట్టు, రొమారియో షెఫర్డ్ కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా ఆఖరి ఓవర్‌లో అయ్యర్ వికెట్ తీయడంతో 7 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది...