భారీ లక్ష్య ఛేదనలో పోరాడుతున్న లంక.. వికెట్ల కోసం కసిగా భారత బౌలర్లు
INDvsSL ODI: శ్రీలంకతో తొలి వన్డేలో బ్యాటింగ్ లో అదరగొట్టిన టీమిండియా.. బౌలింగ్ లో కూడా రాణిస్తోంది. భారీ లక్ష్య ఛేదనలో లంకను ఆరంభంలోనే దెబ్బతీసింది.
ఛేదించాల్సిన లక్ష్యం 374. ఉన్నవి 50 ఓవర్లు. ఈ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన శ్రీలంక.. భారత్ బౌలర్ల ధాటికి ఆదిలోనే కీలక వికెట్లను కోల్పోయింది. టాప్-3 బ్యాటర్లు ముగ్గురూ పెవిలియన్ చేరారు. బ్యాటింగ్ లో అదరగొట్టిన టీమిండియా.. బౌలింగ్ లో కూడా రాణిస్తోంది. సిరాజ్ రెండు వికెట్లు తీయగా జమ్మూ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ కు ఒక వికెట్ దక్కింది. ప్రస్తుతం 19 ఓవర్లు ముగిసేసిరికి లంక.. 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు క్రీజులోకి వచ్చిన శ్రీలంక ఓపెనర్లు పవర్ ప్లే లో భారత బౌలర్లను బాదేందుకు ఫిక్స్ అయి వచ్చారు. అనుకున్నట్టుగానే షమీ వేసిన తొలి ఓవర్లో పతుమ్ నిస్సంక.. రెండు ఫోర్లు కొట్టాడు. రెండో ఓవర్లో ఫెర్నాండో (5) కూడా ఓ బౌండరీ బాదాడు.
అయితే సిరాజ్ వేసిన శ్రీలంక ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఐదో బంతికి ఫెర్నాండో.. హార్ధిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చాడు. అదే ఊపులో సిరాజ్.. తర్వాత ఓవర్లో కుశాల్ మెండిస్ (0) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో లంక 23 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. అయితే నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన చరిత్ అసలంక (23) తో కలిసి నిస్సంక లంక ఇన్నింగ్స్ ను చక్కదిద్దాలని యత్నించాడు. కొన్ని మంచి షాట్లు ఆడి అలరించిన అసలంక.. ఉమ్రాన్ మాలిక్ వేసిన 14వ ఓవర్లో తొలి బంతిని బౌండరీ దాటించాడు.కానీ చివరి బంతికి వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
ప్రస్తుతం ధనంజయ డిసిల్వ (12 బ్యాటింగ్), పతుమ్ నిస్సంక (41 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరి తర్వాత దసున్ శనక ఒక్కడే స్పెషలిస్టు బ్యాటర్. హసరంగ, కరుణరత్నే లు బ్యాటింగ్ చేయగల సమర్థులే అయినా అది కొద్దిసేపు మాత్రమే. భారత బౌలర్లు మరో రెండు వికెట్లు పడితే ఈ మ్యాచ్ ను వీలైనంత త్వరగా ముగించేయచ్చు.