INDvsSL ODI: శ్రీలంకతో గువహతి వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. పవర్ ప్లేలో దంచికొట్టిన రోహిత్, గిల్.. తర్వాత అదే జోరు చూపిస్తున్నారు. 

స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న తొలివన్డేలో టీమిండియా ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నది. ఓపెనర్లు రోహిత్ శర్మ (57 బంతుల్లో 71 నాటౌట్, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభమన్ గిల్ (57 బంతుల్లో 65 నాటౌట్, 10 ఫోర్లు) అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 19 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు.. వికెట్ నష్టపోకుండా 137 గా ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన భారత్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడింది. ముఖ్యంగా రోహిత్ శర్మ.. లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కసున్ రజిత వేసిన తొలి ఓవర్లోనే బౌండరీ బాదిన హిట్‌మ్యాన్.. అతడే వేసిన మూడో ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు కొట్టాడు. మరో ఎండ్ లో శుభమన్ గిల్ కూడా అదే విధంగా రెచ్చిపోయాడు. 

మధుశంక వేసిన నాలుగో ఓవర్లో మూడు ఫోర్లు కొట్టాడు. రజిత వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో రోహిత్ రెండు భారీ సిక్సర్లు బాదడంతో టీమిండియా స్కోరు 6.4 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది. ఆ తర్వాత బంతికి ఫోర్ కొట్టిన రోహిత్ మొత్తంగా ఆ ఓవర్లో 17 పరుగులు రాబట్టాడు.

పేసర్లు భారీగా పరుగులివ్వడంతో లంక సారథి దసున్ శనక స్పిన్నర్ వనిందు హసరంగను రంగంలోకి దించాడు. కానీ అతడిని కూడా గిల్, రోహిత్ సమర్థవంతంగా అడ్డుకున్నారు. హసరంగ వేసిన ఇన్నింగ్స్ 11 వ ఓవర్లో రోహిత్ బ్యాటింగ్ చేస్తుండగా ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేశారు లంక ఆటగాళ్లు. రివ్యూకు వెళ్లినా ఫలితం వారికి అనుకూలంగా రాలేదు. హసరంగ వేసిన 13 ఓవర్లో మూడో బంతికి ఫోర్ బాదిన హిట్‌మ్యాన్.. తన కెరీర్ లో 47వ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 41 బంతుల్లో అతడి అర్థ శతకం పూర్తయింది. 

Scroll to load tweet…

వెల్లలగె వేసిన 15వ ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీయడం ద్వారా భారత్ వంద పరుగులు పూర్తయ్యాయి. ఇక శనక వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండో బంతికి సింగిల్ తీయడం ద్వారా గిల్ కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 51 బంతుల్లో అతడి అర్థ పెంచరీ పూర్తయింది. వన్డేలలో గిల్ కు ఇది ఐదో హాఫ్ సెంచరీ.