కుల్దీప్ మాయ.. సిరాజ్ కేక.. రెండో వన్డేలో భారత్ ముందు ఈజీ టార్గెట్..
INDvsSL Live: భారత పర్యటనలో ఉన్న శ్రీలంక కోల్కతా వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ కు వచ్చి మొదట్లో మురిపించినా మధ్యలో చేతులెత్తేసి చివర్లో మళ్లీ పుంజుకుంది. కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయకు లంక మిడిలార్డర్ కుదేలైంది.

భారత్-శ్రీలంక మధ్య కోల్కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు రాణించారు. లంక టాపార్డర్ బ్యాటర్లు కాస్త మెరుగ్గా ఆడినా భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రాకతో లంక ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. కుల్దీప్ తో పాటు అక్షర్ కూడా అతడికి తోడవడంతో లంక మిడిలార్డర్ కుదేలైంది. చివర్లో ఆ జట్టు పుంజుకున్నట్టు కనిపించినా సిరాజ్.. తోకను కత్తిరించి లంక ఇన్నింగ్స్ కు తెరదించాడు. భారత బౌలర్ల దాటికి లంక.. 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్దీప్, సిరాజ్ తలా మూడు వికెట్లు తీయగా ఉమ్రాన్ కు రెండు వికెట్లు దక్కాయి. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీయడమే గాక మూడు క్యాచ్ లు అందుకున్నాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక శుభారంభం చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (17 బంతుల్లో 20, 4 ఫోర్లు) దాటిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. షమీ వేసిన తొలి ఓవర్ తొలి బంతిని బౌండరీ దాటించిన అవిష్క.. సిరాజ్ బౌలింగ్ లో హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. కానీ సిరాజ్ వేసిన లంక ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో చివరి బంతికి అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
తన కెరీర్ లో తొలి వన్డే ఆడుతున్న నువానిదు ఫెర్నాండో (63 బంతుల్లో 50, 6 ఫోర్లు) తో కలిసి కుశాల్ మెండిస్ (34 బంతుల్లో 34, 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన 12వ ఓవర్లో కుశాల్.. మూడు ఫోర్లు బాదాడు. ఫెర్నాండో, మెండిస్ కలిసి రెండో వికెట్ కు 73 పరుగులు జోడించారు. 15 ఓశవనర్లు ముగిసేసరికి లంక స్కోరు 1 వికెట్ నష్టానికి 88 పరుగులు.
కుల్దీప్ మాయాజాలం..
డ్రింక్స్ తర్వాత రోహిత్ శర్మ.. కుల్దీప్ కు బంతినిచ్చాడు. 17వ ఓవర్ చివరి బంతికి కుల్దీప్.. కుశాల్ ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. ఆ తర్వాత ఓవర్లోనే అక్షర్ పటేల్.. ధనంజయ డిసిల్వ (0) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వికెట్లు పడుతున్నా నిలకడగా బ్యాటింగ్ చేసిన నువానిదు ఫెర్నాండో.. కుల్దీప్ వేసిన 21వ ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీసి హాఫ్ సెంచరీ సాధించాడు. తర్వాత అక్షర్ పటేల్ వేసిన 22వ ఓవర్ తొలి బంతికి ఫెర్నాండో.. రనౌట్ అయ్యాడు. అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన లంక సారథి దసున్ శనక (2)ను కుల్దీప్ బౌల్డ్ చేశాడు. అదే ఊపులో కుల్దీప్.. అసలంక (15) ను కూడా ఔట్ చేసి లంకను కోలుకోలేని దెబ్బతీశాడు. క్రీజులో హసరంగ, వెల్లలగె ఉన్నారు.
తోకను కత్తిరించలేక..
17 ఓవర్లకు 102-2గా ఉన్న లంక.. ఐదు ఓవర్ల వ్యవధిలోనే ఐదు కీలక వికెట్లను కోల్పోయి 126-6గా మారింది. ఆ క్రమంలో వనిందు హసరంగ (17 బంతుల్లో 21, 3 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నది కాసేపే అయినా మెరుపులు మెరిపించాడు. అతడిని ఉమ్రాన్ మాలిక్ పెవిలియన్ చేర్చాడు. చమీక కరుణరత్నె (17) ను కూడా ఉమ్రాన్ ఔట్ చేశాడు. అయితే దునిత్ వెల్లలగె (34 బంతుల్లో 32, 3 ఫోర్లు, 1 సిక్సర్), కసున్ రజిత (21 బంతుల్లో 17, 3 ఫోర్లు) లు టీమిండియా బౌలర్ల సహనాన్ని పరీక్షించడమే గాక లంక స్కోరును 200 దాటించారు.
అయితే నిలకడా ఆడుతున్న వెల్లలగెను సిరాజ్ బోల్తా కొట్టించాడు. సిరాజ్ వేసిన 40వ ఓవర్ రెండో బంతికి అతడు .. అక్షర్ కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత రెండు బంతులే ఆడిన లాహిరు కుమార (0) క్లీన్ బౌల్డ్ కావడంతో లంక ఇన్నింగ్స్ కు తెరపడింది.