తడబడుతున్న టీమిండియా.. లంక బౌలర్ల జోరు.. ఇషాన్, సూర్య, సంజూ, గిల్ పెవిలియన్కు..
IND vs SL LIVE: వాంఖెడే వేదికగా జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బ్యాటింగ్ లో తడబడుతున్నది. ఇప్పటికే భారత్ 4 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ ఏడాదిలో తొలి మ్యాచ్ ఆడుతున్న యువ భారత్.. శ్రీలంకతో వాంఖెడే వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో తడబడుతున్నది. కెరీర్ లో మొదటి టీ20 ఆడుతున్న శుభమన్ గిల్ తో పాటు రాక రాక అవకాశం దక్కించుకున్న సంజూ శాంసన్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ల వికెట్లను కోల్పోయింది. లంక స్పిన్నర్లు జోరుమీదున్నారు.11 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా.. 4 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా.. తొలి రెండు ఓవర్లలో రెచ్చిపోయి ఆడింది. ఇషాన్ కిషన్ తొలి ఓవర్లోనే ఓ బారీ సిక్సర్, రెండు ఫోర్లు బాదాడు. రెండో ఓవర్లో శుభమన్ గిల్ (7) కూడా మధుషనక బౌలింగ్ లో ఫోర్ బాదాడు. కానీ మహేశ్ తీక్షణ వేసిన మూడో ఓవర్లో గిల్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.
వన్ డౌన్ లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (7) కూడా ఎక్కువసేపు నిలువలేదు. తన ఫేవరేట్ స్కూప్ షాట్ ఆడబోయిన సూర్య.. ఔట్ సైడ్ ఆఫ్ వద్ద ఉన్న భానుక రాజపక్సకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ వికెట్ చమీక కరుణరత్నె కు దక్కింది.
సూర్య తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ (5) కూడా ఆకట్టుకోలేదు. ధనంజయ డిసిల్వ వేసిన ఏడో ఓవర్లో.. ఐదో బంతి శాంసన్ బ్యాట్ ఎడ్జ్ కు తాకి మిడ్ వికెట్ వద్ద ఉన్న మధుశనక చేతిలో పడింది. దీంతో టీమిండియా.. 7 ఓవర్లలోనే 47 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయింది. లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కున్న ఇషాన్ కిషన్ (26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37) కూడా హసరంగ వేసిన 11 ఓవర్ మూడో బంతికి ధనంజయ డిసిల్వకు క్యాచ్ ఇచ్చి పెవలియన్ చేరాడు.
ప్రస్తుతం హార్ధిక్ పాండ్యా (18 నాటౌట్), దీపక్ హుడా (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.