రెండో రోజు టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టానికి 61 పరుగులు చేసిన భారత జట్టు... శ్రీలంకపై 204 పరుగుల భారీ ఆధిక్యం... మరోసారి నిరాశపరిచిన మయాంక్ అగర్వాల్... 

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఓవర్‌నైట్ స్కోరు 85/6 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన శ్రీలంక జట్టు... 5.5 ఓవర్లలో మిగిలిన నాలుగు వికెట్లను కోల్పోయింది. 35.5 ఓవర్లలో 109 పరుగులకి శ్రీలంక ఆలౌట్ కావడంతో భారత జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యం దక్కింది...

16 బంతుల్లో ఒక్క పరుగు చేసిన లసిత్ ఎంబూల్దేనియాని జస్ప్రిత్ బుమ్రా అవుట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన లక్మల్‌ను రవిచంద్రన్ అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు... 

38 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసిన శ్రీలంక వికెట్ కీపర్ డిక్‌వాలా, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన విశ్వ ఫెర్నాండోని రవిచంద్రన్ అశ్విన్ స్టంపౌట్ చేయడంతో లంక ఇన్నింగ్స్ ముగిసింది...

ఇప్పటికే విదేశాల్లో 7 సార్లు ఐదేసి వికెట్లు తీసిన భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా... 10 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 మెయిడిన్లతో 5 వికెట్లు తీశాడు. బుమ్రాకి ఇది స్వదేశంలో తొలి ఐదు వికెట్ల ప్రదర్శన కాగా రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీలకు రెండేసి వికెట్లు దక్కగాయి. అక్షర్ పటేల్ ఓ వికెట్ దక్కగా, రవీంద్ర జడేజాకి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. 

మొదటి ఇన్నింగ్స్ అనుభవాల కారణంగా రెండో ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించింది భారత జట్టు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ కలిసి భాగస్వామ్యం నిర్మించడానికి ప్రాధాన్యం ఇచ్చారు. 34 బంతుల్లో 5 ఫోర్లతో 22 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, ఎంబూల్దేనియా బౌలింగ్‌లో ధనంజయకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..

అంపైర్ కాల్స్ కారణంగా హనుమ విహారి, శ్రీలంక ఫీల్డర్లు క్యాచ్ డ్రాప్ చేయడం, రివ్యూ తీసుకోకపోవడంతో రోహిత్ శర్మ రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 48 బంతుల్లో 3 ఫోర్లతో 30 పరుగులు చేయగా, హనుమ విహారి 27 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 

టీ బ్రేక్ సమయానికి 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 61 పరుగులు చేసిన భారత జట్టు... శ్రీలంకపై 204 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది. గత కొన్ని మ్యాచులుగా సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్న కెప్టెన్ రోహిత్ శర్మ మంచి టచ్‌లో కనిపిస్తుండడం అభిమానులకు కలిసి వచ్చే అంశం. ఇప్పటికే 200+, పరుగుల ఆధిక్యం దక్కడం, చేతిలో ఇంకా 9 వికెట్లు మిగిలి ఉండడంతో ఈ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించేసింది టీమిండియా...

వికెట్లు పడకపోతే ఈరోజు మొత్తం బ్యాటింగ్ చేసి, మూడో రోజు భారత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్‌కి కష్టసాధ్యమైన ఈ పిచ్‌పై 300+ లక్ష్యాన్ని అందుకోవాలంటే అంత తేలికయ్యే విషయం కాదు.