పెవిలియన్ బాట పట్టిన రోహిత్, కోహ్లీ, ఇషాన్.. ఉప్పల్లో పోరాడుతున్న టీమిండియా
INDvsNZ Live: ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ లో టీమిండియా తడబడుతున్నది. ఓపెనర్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, డబుల్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరారు.
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ తడబడుతోంది. టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తో పాటు యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా పెవిలియన్ చేరాడు. శుభమన్ గిల్ (63 బంతుల్లో 66 బ్యాటింగ్, 11 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ పూర్తయింది. ప్రస్తుతం అతడు సూర్యకుమార్ యాదవ్ (14 బంతుల్లో 21 నాటౌట్, 4 ఫోర్లు)తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ ను ముందుకు నడిపిస్తున్నాడు. 23 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన భారత్కు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (38 బంతుల్లో 34, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభమన్ గిల్ నింపాదిగా ఆడారు. తొలి ఓవర్ ఆఖరు బంతికి బౌండరీ బాదిన రోహిత్.. షిప్లే వేసిన మూడో ఓవర్లో బౌండరీతో పాటు చివరి బాల్కు సిక్సర్ కొట్టాడు.
షిప్లేనే వేసిన ఐదో ఓవర్లో మరో సిక్సర్ బాదిన హిట్మ్యాన్ తర్వాత జోరు తగ్గించాడు. టిక్నర్ వేసిన భారత ఇన్నింగ్స్ 9వ ఓవర్లో గిల్ రెండు వరుస ఫోర్లు కొట్టాడు. దీంతో భారత్ స్కోరు 50 పరుగులకు చేరింది. పది ఓవర్లు ముగిసేసరికి భారత్.. వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. టిక్నర్ వేసిన 11వ ఓవర్లో మూడో బంతికి ఫోర్ కొట్టిన రోహిత్.. అతడే వేసిన 13వ ఓవర్ తొలి బంతికి భారీ షాట్ ఆడి మిడాన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డారిల్ మిచెల్ కు చిక్కాడు.
రోహిత్ ఔటైనా గిల్ జోరు ఆపలేదు. సాంట్నర్ వేసిన 14వ ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. షిప్లే బౌలింగ్ లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. కానీ అప్పుడు భారత్ కు మరో షాక్ తాకింది. గడిచిన నాలుగు వన్డేలలో మూడు సెంచరీలు చేసిన రన్ మిషీన్ కింగ్ కోహ్లీ (8) ని సాంట్నర్.. 15.2 ఓవర్లో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
ఇక బ్రాస్వెల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ రెండో బంతికి భారీ సిక్సర్ బాదిన గిల్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. గత నెలలో బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్ (5) నిరాశపరిచాడు. లాకీ ఫెర్గూసన్ వేసిన 20వ ఓవర్లో నాలుగో బంతికి అతడు వికెట్ కీపర్, కెప్టెన్ టామ్ లాథమ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఇషాన్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తో కలిసి ప్రస్తుతం శుభమన్ గిల్ భారత స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.