Asianet News TeluguAsianet News Telugu

INDvsENG 5th Test: ముగిసిన మూడో రోజు ఆట... భారీ ఆధిక్యం దిశగా టీమిండియా...

India vs England 5th Test: మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసిన భారత జట్టు... ఇంగ్లాండ్‌పై 257 పరుగుల భారీ ఆధిక్యం... 

INDvsENG 5th Test: Team India dominates 3 day of Edgbaston test, Pujara Half century
Author
India, First Published Jul 3, 2022, 11:41 PM IST

ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో మూడో రోజు కూడా భారత జట్టు ఆధిపత్యమే కొనసాగింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసిన భారత జట్టు, ఇంగ్లాండ్‌పై 257 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉండడం, మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది...న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ ఆఖరి ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాలను ఈజీగా ఛేదించింది. దీంతో నాలుగో రోజు తొలి రెండు సెషన్లలో భారత బ్యాటర్ల ఆట మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేయనుంది.

తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసి అవుటైన శుబ్‌మన్ గిల్, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో రెండో బంతికి ఫోర్ బాదిన గిల్, మూడో బంతికి జాక్ క్రావ్లేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 44 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసిన హనుమ విహారిని స్టువర్ట్ బ్రాడ్ పెవిలియన్ చేర్చాడు. 

40 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ గ్లవ్స్ తాకుతూ వెళ్లిన బంతి, నేరుగా జో రూట్ చేతుల్లో వాలడంతో 75 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా...

ఈ దశలో ఛతేశ్వర్ పూజారా, రిషబ్ పంత్ కలిసి నాలుగో వికెట్‌కి అజేయంగా 50 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 139 బంతుల్లో 5 ఫోర్లతో 50 పరుగులు పూర్తి చేసుకున్న ఛతేశ్వర్ పూజారాతో పాటు 46 బంతుల్లో 4 పోర్లతో 30 పరుగులు చేసిన రిషబ్ పంత్ క్రీజులో ఉన్నారు... 

అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకి ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు భారత జట్టుకి 132 పరుగుల ఆధిక్యం దక్కింది. ఓవర్‌నైట్ స్కోరు 84/5 వద్ద మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్‌, జానీ బెయిర్‌స్టో సెంచరీ కారణంగా ఫాలోఆన్ తప్పించుకోగలిగింది...

అలెక్స్ లీస్ 6, జాక్ క్రావ్లే 9, ఓల్లీ పోప్ 10, జో రూట్ 31 పరుగులు చేసి అవుట్ కాగా రెండో రోజు నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన జాక్ లీచ్ డకౌట్ కావడంతో 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. ఈ దశలో జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్‌ కలిసి ఆరో వికెట్‌కి 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

మహ్మద్ షమీ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను శార్దూల్ ఠాకూర్ జారవిడిచాడు. 18 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బెన్ స్టోక్స్, ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో షాట్‌కి ప్రయత్నించిన బెన్ స్టోక్స్, జస్ప్రిత్ బుమ్రా పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌ని పెవిలియన్ చేరాడు. అంతకుముందు బంతికే బుమ్రా క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన బెన్ స్టోక్స్, తర్వాతి బంతికి అదే షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

36 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసిన బెన్ స్టోక్స్ అవుటైన తర్వాత మరింత దూకుడు పెంచిన జానీ బెయిర్‌స్టో, వరుస బౌండరీలతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్న జానీ బెయిర్‌స్టో, 119 బంతుల్లో శతకాన్ని నమోదు చేశాడు...

మొదటి 64 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసిన జానీ బెయిర్‌స్టో, ఆ తర్వాత 54 బంతుల్లో 84 పరుగులు చేసి టీ20 మోడ్‌లో బ్యాటింగ్ చేయడం విశేషం.  ఈ ఏడాదిలో జానీ బెయిర్‌స్టోకి ఇది ఐదో సెంచరీ. ఐదు అంతకంటే కింద బ్యాటింగ్‌కి వస్తూ ఒకే ఏడాదిలో ఐదు టెస్టు సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు జానీ బెయిర్‌స్టో...

2012లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఐదు సెంచరీలు చేయగా 2022లో ఏడు నెలల్లోనే ఆ ఫీట్‌ని అందుకున్నాడు బెయిర్‌స్టో. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి రెండు టెస్టుల్లో సెంచరీలు చేసిన జానీ బెయిర్‌స్టో, వరుసగా మూడో టెస్టులో హ్యాట్రిక్ శతకాన్ని నమోదు చేశాడు... అంతకుముందు యాషెస్ సిరీస్‌లో ఓ సెంచరీ కొట్టిన జానీ బెయిర్‌స్టో, వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సెంచరీ బాదాడు. 

వరుసగా మూడు టెస్టుల్లో సెంచరీలు చేసిన 15వ ఇంగ్లాండ్ క్రికెటర్‌గా నిలిచిన జానీ బెయిర్‌స్టో, 2016 జనవరి తర్వాత టీమిండియాపై అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన ప్లేయర్‌గా నిలిచాడు. 140 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 106 పరుగులు చేసిన జానీ బెయిర్‌స్టో, మహ్మద్ షమీ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియాపై టెస్టుల్లో 55 క్యాచులు అందుకున్న విరాట్, ఇంగ్లాండ్‌పై 50 క్యాచులను పూర్తి చేసుకున్నాడు...

టెస్టుల్లో రెండు దేశాలపై 50 పైగా క్యాచులు అందుకున్న మొట్టమొదటి భారత ఫీల్డర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. 5 బంతుల్లో 1 పరుగు చేసిన స్టువర్ట్‌ బ్రాడ్‌ని అవుట్ చేసిన మహ్మద్ సిరాజ్, 57 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసిన సామ్ బిల్లింగ్స్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు. 

సిరాజ్ బౌలింగ్‌లో ఓ ఫోర్, సిక్సర్‌ బాదిన మ్యాట్ ప్యాట్స్ 18 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసి అవుట్ కావడంతో 284 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌కి తెర పడింది.

Follow Us:
Download App:
  • android
  • ios