INDvsENG 5th test: ముగిసిన రెండో రోజు ఆట... ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్...
India vs England 5th Test Day 2: రెండో రోజు ఆట ముగిసే సమయానికి 27 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసిన ఇంగ్లాండ్... కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రాకి మూడు వికెట్లు...
ఇంగ్లాండ్తో జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టెస్టులో రెండో రోజు పూర్తిగా టీమిండియా ఆధిపత్యం కొనసాగింది. తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకి ఆలౌట్ అయిన భారత జట్టు, రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్పై ఆధిక్యంలో కొనసాగుతోంది.
వర్షం కారణంగా రెండో రోజు పలు మార్లు అంతరాయాలు కలగడంతో 38 ఓవర్ల ఆట మత్రమే సాధ్యమైంది. తొలి సెషన్లో టీమిండియా ఆలౌట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్ మొదలెట్టిన తర్వాత సరిగ్గా 7 ఓవర్లు కూడా ఆట సాగకముందే ఇప్పటికే రెండు సార్లు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 6.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది ఇంగ్లాండ్...
9 బంతుల్లో ఓ ఫోర్తో 6 పరుగులు చేసిన అలెక్స్ లీస్ని జస్ప్రిత్ బుమ్రా, 3వ ఓవర్ ఆఖరి బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు. లీస్ అవుట్ కాగానే వర్షం కురవడంతో మ్యాచ్కి కాసేపు నిలిచిపోయింది. కొద్దిసేపటి తర్వాత వర్షం చినుకులు ఆగడంతో తిరిగి ఆట ప్రారంభమైంది. 17 బంతుల్లో ఓ ఫోర్తో 9 పరుగులు చేసిన మరో ఓపెనర్ జాక్ క్రావ్లే కూడా బుమ్రా బౌలింగ్లో శుబ్మన్ గిల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. ఓల్లీ పోప్ 18 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లోనే శ్రేయాస్ అయ్యర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్లో అత్యధిక వికెట్లు తీసిన భారత పేస్ బౌలర్గా కపిల్ దేవ్ రికార్డును అధిగమించాడు బుమ్రా...
15.1 ఓవర్లు ముగిసిన తర్వాత మరోసారి వర్షం పలకరించింది. దీంతో చాలా సేపు ఆట నిలిచిపోయింది. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత క్రీజులో అతుక్కుపోయేందుకు ప్రయత్నిస్తున్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ని మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. సిరాజ్ బౌలింగ్లో రూట్ బ్యాటును ముద్దాడుతూ వెళ్లిన బంతి, పంత్ చేతుల్లో పడింది...
67 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన జో రూట్ అవుటైన తర్వాత నైట్ వాచ్మెన్గా వచ్చిన జాక్ లీచ్ను మహ్మద్ షమీ డకౌట్ చేశాడు. 83 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. బీభత్సమైన ఫామ్లో ఉన్న జానీ బెయిర్ స్టో 47 బంతుల్లో ఓ ఫోర్తో 12 పరుగులు, కెప్టెన్ బెన్ స్టోక్స్ 4 బంతులాడి పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. భారత జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 332 పరుగులు వెనకబడి ఉంది ఇంగ్లాండ్..
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 338/7 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, 84.5 ఓవర్లలో 416 పరుగులకి ఆలౌట్ అయ్యింది. శుబ్మన్ గిల్ 17, ఛతేశ్వర్ పూజారా 13, హనుమ విహారి 20, విరాట్ కోహ్లీ 11, శ్రేయాస్ అయ్యర్ 15 పరుగులు చేసి అవుట్ కావడంతో 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టును రిషబ్ పంత్, రవీంద్ర జడేజా కలిసి ఆదుకున్నారు...
ఆరో వికెట్కి 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రిషబ్ పంత్ 111 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్లతో 146 పరుగులు చేసి జో రూట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. శార్దూల్ ఠాకూర్ 12 బంతుల్లో ఒక్క పరుగు చేసి అవుట్ కాగా మహ్మద్ షమీతో కలిసి 8వ వికెట్కి 48 పరుగులు జోడించాడు రవీంద్ర జడేజా...
31 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసిన మహ్మద్ షమీని స్టువర్ట్ బ్రాడ్ అవుట్ చేయగా 194 బంతుల్లో 13 ఫోర్లతో 104 పరుగులు చేసి టెస్టుల్లో మూడో సెంచరీ నమోదు చేశాడు రవీంద్ర జడేజా.. జడ్డూని జేమ్స్ అండర్సన్ క్లీన్ బౌల్డ్ చేయగా క్రీజులోకి వస్తూనే బౌండరీల మోత మోగించాడు జస్ప్రిత్ బుమ్రా...
స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఇన్నింగ్స్ 84వ ఓవర్లో రెండు సిక్సర్లు, 3 ఫోర్లతో 29 పరుగులు రాబట్టాడు జస్ప్రిత్ బుమ్రా. ఈ ఓవర్లో ఎక్స్ట్రాలతో కలిపి 35 పరుగులు సమర్పించిన స్టువర్ట్ బ్రాడ్, టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించిన బౌలర్గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసిన జస్ప్రిత్ బుమ్రా నాటౌట్గా నిలవగా మహ్మద్ సిరాజ్ 6 బంతుల్లో 2 పరుగులు చేసి అండర్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు...
టెస్టు క్రికెట్ చరిత్రలో 32వ సారి 5 వికెట్ల ఫీట్ని నమోదు చేశాడు జేమ్స్ అండర్సన్. మ్యాటీ ప్యాట్స్కి రెండు వికెట్లు దక్కగా స్టువర్ట్ బ్రాడ్, బెన్ స్టోక్స్, జో రూట్ తలా ఓ వికెట్ తీశారు.