INDvsENG: రిషబ్ పంత్ కూడా అవుట్... ఘోర ఓటమి అంచున టీమిండియా...
తీవ్రంగా నిరాశపరిచిన రిషబ్ పంత్, అజింకా రహానే... ఉదయం సెషన్లోనే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా...
మూడో టెస్టులో టీమిండియా ఓటమి అంచుల్లో నిలిచింది. నాలుగో రోజు ఉదయం సెషన్లోనే వరుస వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు... ఓవర్నైట్ స్కోరు 215/2 పరుగుల వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా, అదే స్కోరు వద్ద ఛతేశ్వర్ పూజారా వికెట్ కోల్పోయింది.
189 బంతుల్లో 15 ఫోర్లతో 91 పరుగులు చేసిన పూజారా, 9 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు... ఛతేశ్వర్ పూజారా 90ల్లో అవుట్ కావడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఆస్ట్రేలియాపై 2017లో 92 పరుగులకి అవుట్ అయ్యాడు ఛతేశ్వర్ పూజారా..
విరాట్ కోహ్లీ బౌండరీతో టెస్టుల్లో 26వ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఇంగ్లాండ్లో విరాట్కి ఇది ఆరో హాఫ్ సెంచరీ కెప్టెన్గా ఇంగ్లాండ్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన భారత కెప్టెన్గా ధోనీ రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లీ...
వరుసగా రెండు ఫోర్లు బాది జోరు మీదున్నట్టుగా కనిపించిన విరాట్ కోహ్లీ, రాబిన్సన్ బౌలింగ్లో మరోసారి షాట్ ఆడబోయి జో రూట్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... 237 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా.
కోహ్లీ, రహానే వికెట్లను వరుస ఓవర్లలో కోల్పోయిన టీమిండియా, ఆ తర్వాతి ఓవర్లో రిషబ్ పంత్ వికెట్ను కోల్పోయింది. ఏడు బంతులు ఆడిన రిషబ్ పంత్, కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 100+ పరుగులు వెనకబడి ఉంది టీమిండియా...