INDvsAUS: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న  టెస్టు సిరీస్ లో  మూడో టెస్టు వేదిక మారే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.  

భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్ వేదికగా తొలి టెస్టు ఘనంగా ముగిసిన విషయం తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య ధర్మశాల వేదికగా మూడో టెస్టు జరగాల్సి ఉంది. అయితే తాజా రిపోర్టుల ప్రకారం.. మూడో టెస్టు (మార్చి 1-5) ధర్మశాల లో జరిగేది అనుమానంగానే ఉంది. ధర్మశాల స్టేడియంలో రెనోవేషన్ (పునరుద్ధరణ) పనులు జరుగుతున్నాయి. ఇవి మూడో టెస్టు ప్రారంభమయ్యే (మార్చి 1) నాటికి పూర్తవుతాయా..? లేదా..? అన్నది అనుమానంగానే ఉంది.

మూడో టెస్టుకు ముందే ఈనెల 3న బీసీసీఐ బృందం తనిఖీలు నిర్వహించింది. అయితే ఈ తనిఖీలలో భాగంగా ఔట్ ఫీల్డ్ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని.. అంతేగాక సౌడ్ ఏరియాకు సంబంధించి పిచ్ నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తున్నది.

అయితే ఈ టెస్టు ప్రారంభానికి మరో మూడు వారాల సమయం ఉన్నందన ఆలోపు పెండింగ్ పనులను పూర్తి చేస్తామని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌పీసీఏ) చెబుతున్నది. కొద్దిరోజుల క్రితమే ధర్మశాలలో పాత పిచ్ ను తొలగించి కొత్తది తయారుచేశారు. వర్షం వస్తే మ్యాచ్ కు అంతరాయం కలగకుండా ఉండేందుకు గాను కొత్త డ్రైనేజీ వ్యవస్థను అమర్చారు. ఇందుకు సంబంధించిన పనులు తుది దశలో ఉన్నాయి. అయితే ఇటీవలే ఈ పిచ్ ను పరిశీలించిన బీసీసీఐ బృందం.. టెస్టు మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ధర్మశాలలో మూడో టెస్టు జరుగుతుందా..? లేదా..? అన్నది అనుమానంగా ఉంది. 

బ్యాకప్ ‌గా ఐదు.. 

ధర్మశాల పిచ్ పై మరో రెండు మూడు రోజుల్లో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. అయితే ఒకవేళ ధర్మశాలలో కాకుంటే మరో చోట మ్యాచ్ నిర్వహించేందుకు కూడా బీసీసీఐ బ్యాకప్ గా మరో ఐదు స్టేడియాలను ఎంపిక చేసినట్టు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో వెల్లడించింది. మొహాలీ, విశాఖపట్నం, రాజ్‌కోట్, పూణె, ఇండోర్ లలో టెస్టు మ్యాచ్ నిర్వహణకు అనుకూలమైన వాతావరణం ఉన్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మొహాలీలో నిర్వహించేందుకే అన్ని అవకాశాలు ఉన్నట్టు సమచారం. దీనిపై త్వరలోనే బీసీసీఐ తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. 

ఇక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులు చేసిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 91 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్.. 400 పరుగులు చేసింది. ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ సందర్భంగా భారత్ బౌలర్లలో అశ్విన్ కు ఐదు వికెట్లు దక్కగా.. జడేజా, షమీలకు రెండు, అక్షర్ కు ఒక్క వికెట్ దక్కింది. అశ్విన్ స్పిన్ మాయాజాలానికి కంగారూలు కంగారెత్తారు. ఈ టెస్టు విజయంతో భారత్.. నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు.. ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీ వేదికగా జరుగనుంది.