INDvsAUS 2nd Test: ఇండియా-ఆస్ట్రేలియా మధ్య  ఢిల్లీ వేదికగా ముగిసిన రెండో టెస్టును  మూడు రోజుల్లోనే ముగించింది టీమిండియా. ఈ మ్యాచ్ లో  ఒకదశలో ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించినా  మళ్లీ భారత్ పుంజుకుంది.

భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్ తో పాటు ఢిల్లీ టెస్టు కూడా మూడు రోజుల్లోనే ముగిసింది. తొలి టెస్టులో ప్రత్యర్థి నుంచి ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే గెలిచిన ఇండియా రెండో టెస్టులో మాత్రం కఠిన సవాళ్లను ఎదుర్కుంది. నాగ్‌పూర్ లో మాదిరిగా ఆసీస్.. ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అంత ఈజీగా లొంగలేదు. అదీగాక భారత్ తొలి ఇన్నింగ్స్ లో కూడా తడబడింది. కొంతసేపు ఆధిక్యం ప్రదర్శించినా ఈ మ్యాచ్ లో ఆసీస్ చివరికి తడబడి మ్యాచ్ ను కోల్పోయింది. 

ఈ టెస్టులో భారత్ గెలుపునకు దోహదపడ్డ అంశాలను తాజాగా రోహిత్ శర్మ రివీల్ చేశాడు. ఢిల్లీ టెస్టు అనంతరం అతడు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రవీంద్ర జడేజా రెండో ఇన్నింగ్స్ లో విజృంభించి టీమిండియాకు విజయాన్ని అందించినా.. కోహ్లీతో కలిసి అతడు నెలకొల్పిన భాగస్వామ్యం, అక్షర్ - అశ్విన్ ల పోరాటం చాలా కీలకమని హిట్‌మ్యాన్ అన్నాడు. 

మ్యాచ్ ముగిశాక రోహిత్ మాట్లాడుతూ.. ‘ఈ టెస్టులో మా విజయానికి నాలుగు ఇన్నింగ్స్ లలో చాలా అంశాలు దోహదం చేశాయి. అందులో మరీ ముఖ్యంగా మేం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జడేజా - విరాట్ ల మధ్య భాగస్వామ్యం ఒకటి. అక్షర్ పటేల్ - అశ్విన్ లు పోరాడిన తీరు ఈ మ్యాచ్ లో చాలా కీలకం. అది మాకు చాలా హెల్ప్ చేసింది... 

ఇక ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్, జడేజాల బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వాస్తవానికి నిన్న (శనివారం) మేం కాస్త వెనుకబడ్డట్టు అనిపించింది. కానీ ఈరోజు ఉదయం సెషన్ లో మా బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చాలా బాగుంది. జడేజా, అశ్విన్ లు నమ్మశక్యం కాని బౌలింగ్ తో మ్యాచ్ ను మావైపునకు తిప్పారు..’అని వ్యాఖ్యానించాడు. 

Scroll to load tweet…

ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో లియాన్ విజృంభణను తట్టుకుని కోహ్లీ - జడేజాలు 59 పరుగులు జోడించారు. ఆ తర్వాత అశ్విన్ - అక్షర్ లు 114 పరుగుల భాగస్వామ్యంతో భారత్ ను తిరిగి పోటీలోకి తెచ్చారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా రెండో రోజు ధాటిగా ఆడినా మూడో రోజు ఉదయం మాత్రం ఆ జట్టుకు పప్పులేమీ ఉడకలేదు. జడ్డూ, అశ్విన్ లు క్రమం తప్పకుండా వికెట్లను తీస్తూ ఆసీస్ పై ఒత్తిడి పెంచారు. జడ్డూ ఏడు వికెట్లు తీయగా అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా ఆసీస్.. 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్యాన్ని భారత్.. 26.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.