Border Gavaskar Trophy 2023: నాగ్పూర్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు తొలి సెషన్ లో భారత్ నిలకడగా ఆడుతోంది.
నాగ్పూర్ టెస్టులో భారత్ జోరు మీదుంది. తొలి రోజు ఆస్ట్రేలియాను 177 పరుగులకే ఆలౌట్ చేసి ఆ తర్వాత టీమిండియా సారథి రోహిత్ శర్మ బ్యాటింగ్ లో తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఓవర్నైట్ స్కోరు 77-1 వద్ద రెండో రోజు తొలి సెషన్ ఆరంభించిన భారత్.. సంయమనంతో ఆడుతోంది. హిట్మ్యాన్ రోహిత్ శర్మ.. 115 బంతుల్లో 81 పరుగులు చేసి సెంచరీ దిశగా సాగుతున్నాడు. మరోవైపు నైట్ వాచ్మన్ గా వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (62 బంతుల్లో 23, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఆసీస్ ను విసిగించాడు. ప్రస్తుతం 43 ఓవర్లలో భారత్.. 2 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 43 పరుగులు వెనకబడి ఉంది.
ఓవర్ నైట్ స్కోరు 77 వద్ద రెండో రోజు ఆట ఆరంభించిన టీమిండియా.. తొలి ఓవర్లలో ఆసీస్ కు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. రోహిత్, అశ్విన్ లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఆసీస్ సారథి పాట్ కమిన్స్.. బౌలర్లను మార్చి మార్చి బౌలింగ్ చేయించినా ఈ ఇద్దరూ ధీటుగా ఎదుర్కొన్నారు.
కమిన్స్ వేసిన ఇండియా ఇన్నింగ్స్ 32వ ఓవర్ లో ఆఖరుబంతికి రోహిత్ డీప్ స్క్వేర్ లెగ్ లో భారీ సిక్స్ బాదాడు. ఆ తర్వాత నాథన్ లియాన్ వేసిన ఓవర్లో అశ్విన్ కూడా లెగ్ సైడ్ స్లాగ్ స్వీప్ ద్వారా భారీ సిక్స్ కొట్టాడు. 33వ ఓవర్లో భారత్ స్కోరు 100 పరుగులు దాటింది. లియాన్ వేసిన 35వ ఓవర్లో ఫోర్ కొట్టి రోహిత్ 70లలోకి వచ్చాడు.
అశ్విన్ విసిగిస్తుండటంతో కమిన్స్.. స్పిన్నర్ మర్పీతోనే ఎక్కువ ఓవర్లు వేయించాడు. అతడి బౌలింగ్ లో అశ్విన్ కాస్త ఇబ్బందిపడ్డాడు. అతడే వేసిన 41వ ఓవర్లో తొలి బంతికి అశ్విన్.. ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు. అశ్విన్, రోహిత్ లు రెండో వికెట్ కు 42 పరుగులు జోడించారు.
అశ్విన్ నిష్క్రమించడంతో టీమిండియా నయా వాల్ ఛటేశ్వర్ పుజారా (6 నాటౌట్) క్రీజులోకి వచ్చాడు. వీళ్లిద్దరూ రెండో సెషన్ ముగిసే వరకూ బ్యాటింగ్ చేస్తే మ్యాచ్ పై భారత్ మరింత పట్టు బిగించే అవకాశం ఉంటుంది.
