మార్ష్ బాదుడుకు జడ్డూ అడ్డుకట్ట.. అయినా పటిష్ట స్థితిలో ఆసీస్..
INDvsAUS 1st ODI: భారత్ - ఆస్ట్రేలియా మధ్య వాంఖెడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ ఓడిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ కు వచ్చింది. రెండు వికెట్లు కోల్పోయినా పటిష్ట స్థితిలోనే ఉంది.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య వాంఖెడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా ధాటిగా ఆడుతోంది. చాలాకాలం తర్వాత జట్టులోకి వచ్చిన స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్ (65 బంతుల్లో 81, 10 ఫోర్లు, 5 సిక్సర్లు) భారత బౌలర్లను ఆటాడుకున్నాడు. మార్నస్ లబూషేన్ (11 నాటౌట్) తో కలిసి ఆసీస్ స్కోరువేగాన్ని పెంచాడు. కానీ భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆసీస్ కు షాకిచ్చాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా.. 20 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన ఆసీస్కు మహ్మద్ సిరాజ్ తాను వేసిన తొలి ఓవర్లోనే షాకిచ్చాడు. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (5) ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్ భారత్ కు బ్రేకిచ్చాడు. తొలి వికెట్ కోల్పోయినా ఆసీస్ మాత్రం బెదరలేదు. రెండో వికెట్ కు స్టీవ్ స్మిత్ (30 బంతుల్లో 22, 4 ఫోర్లు) తో కలిసి మార్ష్.. 72 పరుగులు జోడించాడు.
తొలి ఓవర్లోనే వికెట్ తీసిన సిరాజ్ తర్వాత ఓవర్లలో భారీగా పరుగులిచ్చుకున్నాడు. అతడు వేసిన ఆసీస్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మార్స్ మూడు బౌండరీలు బాదాడు. ఆ తర్వాత షమీ బౌలింగ్ లో స్మిత్ రెండు ఫోర్లు కొట్టాడు. సిరాజ్ వేసిన 8వ ఓవర్లో మార్ష్ మరో రెండు బౌండరీలు సాధించాడు. శార్దూల్ వేసిన పదో ఓవర్లో భారీ సిక్సర్ బాదాడు.
ఈ ఇద్దరినీ ఔట్ చేయడానికి భారత బౌలర్లను మార్చి మార్చి వాడినా ఫలితం లేకపోయింది. చివరికి కెప్టెన్ హార్ధిక్ పాండ్యా వేసిన 13వ ఓవర్లో మూడో బంతికి స్మిత్.. వికెట్ కీపర్ కెఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం లబూషేన్ తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్ ను నడిపిస్తున్న మార్ష్.. అర్థ సెంచరీ సాధించి మూడంకెల స్కోరు మీద కన్నేశాడు. వన్డేలలో మార్ష్ కు ఇది 14వ అర్థ సెంచరీ.
హాఫ్ సెంచరీ తర్వాత మార్ష్.. కుల్దీప్ వేసిన ద 19వ ఓవర్లో 4, 6 బాదాడు. అయితే జడేజా వేసిన 20 వ ఓవర్లో మార్ష్.. సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. క్రీజులో ఉన్నలబూషేన్ జోష్ ఇంగ్లిస్ ల తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్ లు కూడా ఉండటంతో ఆసీస్ భారీ స్కోరు మీద కన్నేసింది. ఇదే ఊపులో ఆడితే భారత్ టార్గెట్ 350 ప్లస్ ఉండొచ్చు.