ACC Womens Emerging Teams Asia Cup 2023: ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ - 2023 ఫైనల్ పోరులో భారత మహిళల ‘ఏ’ జట్టు సంచలన విజయంతో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది.
ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో హాంకాంగ్ వేదికగా ముగిసిన ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ - 2023 ఫైనల్ పోరులో భారత మహిళల ‘ఏ’ జట్టు సంచలన విజయంతో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది. ఫైనల్ లో బంగ్లాదేశ్ ను ఓడించిన భారత జట్టు ట్రోఫీని నెగ్గి విజేతగా నిలిచింది. టీమిండియా యువ ఆటగాళ్లు కనికా అహుజా, శ్రేయాంక్ పాటిల్ లు రాణించడంతో భారత జట్టు అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.
మాంగ్ కాంగ్ (హాంకాగ్) వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు సారథి శ్వేతా సెహ్రావత్ బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది.
భారత జట్టు తరఫున విృందా దినేశ్ (36), కనిక అహుజా (30) రాణించారు. బ్యాటింగ్ లో ఆకట్టుకోలేకపోయినా బౌలింగ్ లో మాత్రం టీమిండియాకు తిరుగులేకుండా పోయింది. యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ మరోసారి విజృంభించి నాలుగు వికెట్లు పడగొట్టింది. బ్యాటింగ్ లో రాణించిన అహుజా.. బౌలింగ్ లో కూడా రెండు వికెట్లు తీయడం గమనార్హం. మన్నత్ కశ్యప్ 3 వికెట్లు పడగొట్టగా టిటాస్ సాధుకు ఒక వికెట్ దక్కింది. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో నహిదా అక్తర్ (17) అత్యధిక స్కోరు నమోదుచేసింది.
శ్రేయాంక ఇదే సీరిస్ లో హాంకాంగ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో మూడు ఓవర్లు బౌలింగ్ చేసి . ఓ మెయిడిన్ చేయడమే గాక రెండు పరుగులే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి హాంకాంగ్ వెన్ను విరిచింది. ఆమె ఇచ్చిన రెండు పరుగులలో ఒకటి వైడ్ రూపంలో వచ్చిందే కావడం గమనార్హం.
ఈ టోర్నీలో యూఏఈ, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, పాకిస్తాన్, నేపాల్, హాంకాంగ్, భారత్ లు పాల్గొన్నాయి.
