భారత స్టార్ పేసర్ రేణుకా సింగ్కు ఐసీసీ అత్యున్నత పురస్కారం..
ICC: యువ భారత పేసర్, మహిళా క్రికెట్ లో దూసుకొస్తున్న రేణుకా సింగ్ గత కొంతకాలంగా తన బౌలింగ్ తో సంచలనాలు సృష్టిస్తున్నది. మరీ ముఖ్యంగా గతేడాది ఆమె తన ప్రదర్శనలతో అదరగొట్టింది.
క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇంకా ఏడాది కూడా కాకముందే టీమిండియా యువ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ కు అవార్డులు క్యూ కడుతున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో భారత జట్టులోకి వచ్చిన ఈ హిమాచల్ ప్రదేశ్ అమ్మాయి.. 2022కు గాను ఐసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఈయర్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ మేరకు ఐసీసీ బుధవారం ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ అవార్డు రేసులో ఆస్ట్రేలియాకు చెందిన డార్సీ బ్రౌన్, ఇంగ్లాండ్ క్రీడాకారిణి అలైస్ క్యాప్సీ లతో పాటు తన సహచర క్రికెటర్ యష్తిక భాటియాలు పోటీలో ఉన్నా రేణుకాసింగ్ నే ఈ అవార్డు వరించింది. ఏడాదికాలంగా వన్డేలతో పాటు టీ20లలో భారత్ సాధించిన విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్న రేణుకాకు ఈ అవార్డు దక్కింది.
గతేడాది ఫిబ్రవరి 18న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో వన్డేలలోకి ఎంట్రీ ఇచ్చిన రేణుకా.. ఇప్పటివరకు 7 వన్డేలు ఆడి 18 వికెట్లు పడగొట్టింది 21 వన్డేలలో 22 వికెట్లు తీసింది. 29 మ్యాచ్ లలోనే 40 వికెట్లు సాధించింది.
భారత జట్టు వెటరన్ పేసర్ జులన్ గోస్వామి గతేడాది ఇంగ్లాండ్ పర్యటన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె వారసురాలిగా జట్టులోకి వచ్చిన రేణుకా.. అందుకు తగ్గ ప్రదర్శనలు చేస్తూ భారత విజయాల్లో కీలకంగా నిలుస్తున్నది.
గతేడాది కామన్వెల్త్ గేమ్స్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో రేణుకా వేసిన స్పెల్ ఓ సంచలనం. నాలుగు ఓవర్లు వేసిన ఆమె నలుగురు ఆసీస్ బ్యాటర్లను ఔట్ చేసి ఆ జట్టుకు భారీ షాకిచ్చింది. ఇన్ స్వింగర్ ఆమె ఆయుధం. బ్యాటర్లను తికమకపెట్టి లోపలికి దూసుకొచ్చే బంతి వికెట్లను గిరాటేయడం ఆమె ప్రత్యేకత. మేటి క్రికెటర్లను కూడా దాటుకుని ఐసీసీ అవార్డు స్వీకరించడంపై ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.