స్వదేశం చేరుకున్న భారత జట్టు... రహానే, విహారి, సిరాజ్ అండ్ జట్టుకి ఘన స్వాగతం...
ఆస్ట్రేలియాలో చారిత్రక విజయం తర్వాత స్వదేశానికి భారత జట్టు...
ఐదు నెలల తర్వాత ఇంటికి చేరుకున్న భారత క్రికెటర్లు...
భారత తాత్కాలిక సారథి అజింకా రహానేకి ఘనమైన స్వాగతం... కెప్టెన్ రహానే అంటూ ఫ్లకార్డులు, హోర్డింగులు...
ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను టెస్టు సిరీస్లో 2-1 తేడాతో చిత్తు చేసిన భారత జట్టు, స్వదేశానికి వచ్చేసింది. ఐపీఎల్ 2020 సీజన్ కోసం గత ఏడాది సెప్టెంబర్ మొదట్లో యూఏఈ చేరుకున్న భారత క్రికెటర్ల, దాదాపు ఐదు నెలల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చారు. విరాట్ కోహ్లీ గైర్హజరీతో భారత జట్టుకి సారథ్యం వహించిన అజింకా రహానేకి తన ఇంటి దగ్గర ఘన స్వాగతం లభించింది. భారీగా తరలివచ్చిన అభిమానులు, సోసైటీ సభ్యులు, మేళతాళాలతో ఊరేగింపుగా రహానేకి తీసుకు వెళ్లారు.
రహానే ఇంటి ముందు కెప్టెన్ రహానే అని బోర్డును ఏర్పాటు చేశారు అభిమానులు. ఐదు టెస్టులు, నాలుగు విజయాలు, ఆస్ట్రేలియాలో మూడు విజయాలు, సిరీస్లో రెండు విజయాలు, ఒక డ్రా... సున్నా ఓటములు అని రాసి ఉన్న బోర్డుపై ‘వరల్డ్ క్లాస్ కెప్టెన్’ అంటూ రహానేకి స్వాగతం పలికారు అభిమానులు.
పృథ్వీషా, సిరాజ్, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ తదితర క్రికెటర్ల కూడా స్వంత రాష్ట్రాల్లో ఘనమైన స్వాగతం లభించింది. హైదరాబాద్ క్రికెటర్ సిరాజ్ ఇంటి దగ్గర అభిమానుల సందడి బాగా కనిపించింది.
కుటుంబసభ్యులతో కొంతకాలం గడిపిన తర్వాత ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం చెన్నై బయో బబుల్ జోన్లోకి వెళ్లబోతున్నారు భారత క్రికెటర్లు. తొలి రెండు టెస్టులకు ఎంపికైన ప్లేయర్లు అందరూ చెన్నై టెస్టుకి 12 రోజుల ముందే బయో బబుల్ జోన్లోకి తిరిగి రావాల్సి ఉంటుంది.