ఇండియా-వెస్టిండిస్ ఫస్ట్ టెస్ట్: టపటపా వికెట్లు... తడబడుతున్న భారత టాప్ ఆర్డర్
ఆంటిగ్వా వేదికన జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో వెస్టిండిస్ బౌలర్ల ధాటికి టీమిండియా టాప్ ఆర్డర్ విలవిల్లాడుతోంది. ముఖ్యంగా విండీస్ బౌలర్ రోచ్, గ్యాబ్రియెల్ లు చెలరేగిపోతున్నారు.
వెస్టిండిస్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో టీమిండియా టాప్ ఆర్డర్ తడబడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోహ్లీసేన కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(5 పరుగులు),చటేశ్వర్ పుజారా(2 పరుగులు)లను విండీస్ బౌలర్ రోచ్ ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. దీంతో భారత జట్టు కేవలం 7 పరుగులకే కీలకమైన రెండు టాపార్డర్ వికెట్లను కోల్పోయింది.
ఆ తర్వాత గ్యాబ్రియెల్ బౌలింగ్ లో టీమిండియాపై పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పుజారా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(9 పరుగులు) నెమ్మదిగా ఆడుతూ వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతన్ని గ్యాబ్రియెల్ ఓ అద్భుతమైన బంతితో బోల్తాకొట్టించి బంతిని గాల్లోకి లేపేలా చేశాడు. దీంతో బ్రూక్స్ చాకచక్యంగా ఆ క్యాచ్ ను అందుకున్నాడు. దీంతో 25 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది.
ప్రస్తుతం కెఎల్ రాహుల్,రహానేలు నిలకడగా ఆడుతూ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వీరు వికెట్ల పతనాన్ని అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా విండీస్ బౌలర్లు విసిరే బౌన్సర్లు టీమిండియా బ్యాట్స్ మెన్స్ ను ఇబ్బంది పెడుతున్నాయి.