విండీస్‌కి కలిసి వచ్చిన డీఆర్‌ఎస్ రివ్యూలు... 61 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన సూర్యకుమార్ యాదవ్... వెస్టిండీస్ ముందు 166 పరుగుల టార్గెట్.. 

టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగుల స్కోరు చేసింది. నాలుగో టీ20లో 178 పరుగుల స్కోరు చేసిన వెస్టిండీస్ ముందు 166 పరుగుల స్కోరుని టార్గెట్‌గా పెట్టింది టీమిండియా... మొదటి మూడు మ్యాచుల్లో మాదిరిగానే ఫైనల్ మ్యాచ్‌లోనూ టాపార్డర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.. ఫోర్ బాది ఖాతా తెరిచిన యశస్వి జైస్వాల్, అకల్ హుస్సేన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

9 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ కూడా అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు కెమెరాల్లో కనిపించినా రివ్యూ తీసుకోకపోవడంతో గిల్ అవుట్ అయ్యాడు. 

టీ20 సిరీస్‌లో నాలుగు సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటైన ఓపెనర్ శుబ్‌మన్ గిల్, చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. ఇంతకుముందు 2021లో కెఎల్ రాహుల్ మూడు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అయ్యాడు. 

 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ కలిసి మూడో వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అల్జెరీ జోసఫ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో 4, 6, 4, 4 బాదిన తిలక్ వర్మ 19 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 51 పరుగులు చేసింది భారత జట్టు..

18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసిన తిలక్ వర్మ, రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొదటి 5 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 173 పరుగులు చేసిన తిలక్ వర్మ, దీపక్ హుడా (215 పరుగులు), కెఎల్ రాహుల్ (187 పరుగులు) తర్వాతి ప్లేస్‌లో నిలిచాడు. 

9 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన సంజూ శాంసన్, రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో నికోలస్ పూరన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

87 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా. వెస్టిండీస్ ఫీల్డర్లు క్యాచ్ డ్రాప్ చేయడంతో రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న హార్ధిక్ పాండ్యా 16 బంతుల్లో 8 పరుగులే చేశాడు. 39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 

వర్షం కారణంగా కొద్దిసేపు ఆట నిలిచి తిరిగి ప్రారంభమైంది. రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన హార్ధిక్ పాండ్యా, ఆ తర్వాతి బంతికి అదే రకమైన షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 18 బంతుల్లో ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు హార్ధిక్ పాండ్యా..

45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూ తీసుకున్న వెస్టిండీస్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది.. 

రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన అర్ష్‌దీప్ సింగ్, ఆ తర్వాతి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే కుల్దీప్ యాదవ్ డకౌట్ అయ్యాడు. ఈసారి కూడా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడం, రివ్యూలో బంతి వికెట్లను తాకుతున్నట్టు కనిపించడంతో విండీస్‌కి వికెట్ దక్కింది..


ఆఖరి ఓవర్‌లో 2 బంతులు మిగిలి ఉండగా మరోసారి ఆటకి అంతరాయం కలిగింది. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాతి అక్షర్ పటేల్ వికెట్ కోల్పోయింది టీమిండియా. 10 బంతుల్లో ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసిన అక్షర్ పటేల్, సిరీస్‌లో మరోసారి నిరాశపరిచాడు.. ఆఖరి బంతికి ముకేశ్ కుమార్ ఫోర్ బాదడంతో టీమిండియా స్కోరు 165 పరుగులకి చేరుకుంది..