India Vs Srilanka 1st Test: శ్రీలంకతో మొహాలి వేదికగా జరుగుతున్న తొలి టెస్టు.. కాదు కాదు రవీంద్ర జడేజా టెస్టులో భారత్ అదరగొడుతున్నది. అదేంటి..? రవీంద్ర జడేజా పేరు మీద టెస్టు జరుపుతున్నారా..? అని అనుకుంటున్నారా..? 

మొహాలి టెస్టుకు ముందు టీమిండియా ఆల్ రౌండర్  రవీంద్ర జడేజా మూడు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. న్యూజిలాండ్ తో గతేడాది నవంబర్ లో కాన్పూర్ లో జరిగిన టెస్టులో గాయపడ్డాడు. దీంతో అతడు రెండో టెస్టు కూడా ఆడలేదు.  గాయం కారణంగా  ఇన్నాళ్లు  జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో ఉన్న జడ్డూ.. లంకతో టీ20ల  సందర్భంగా రీ ఎంట్రీ ఇచ్చాడు.  మూడు వన్డేలలో అదరగొట్టిన ఈ రాక్ స్టార్.. ఈనెల 4న మొదలైన తొలి టెస్టులో తనదైన ముద్ర వేస్తున్నాడు.  తొలుత బ్యాటింగ్ లో అదరగొట్టాడు.  అనంతరం  బౌలింగ్ లో దుమ్ముదులిపాడు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో అభిమానులు అతడిపై  ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  జడ్డూ అదరగొట్టే ప్రదర్శనతో టీమిండియా ఫ్యాన్స్ అంతా.. ఇది మొహాలీ టెస్టు కాదని, రవీంద్ర జడేజా టెస్టు అని పిలవాలని కామెంట్స్ చేస్తున్నారు. 

తొలుత బ్యాటింగ్ లో 228 బంతుల్లో 175 పరుగులు చేశాడు జడ్డూ.. ఈ మారథాన్ ఇన్నింగ్స్ లో 17 బౌండరీలు, 3 సిక్సర్లు కూడా ఉన్నాయి. జడ్డూ సూపర్ ఇన్నింగ్స్  తో భారత్ 8 వికెట్లకు 578 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు  వచ్చిన లంకకు  జడ్డూ చుక్కలు చూపించాడు. 

 

Scroll to load tweet…

లంక ఇన్నింగ్స్ లో 13 ఓవర్లు వేసి 41 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. జడ్డూ విజృంభణ తో లంక.. 65 ఓవర్లలో 174 పరుగులే చేయగలిగింది. దీంతో ట్విట్టర్ లో  అతడి అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు జడేజా పై ప్రశంసల్తో ముంచెత్తుతున్నారు. 

సాక్షాత్తు భారత క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘జడేజా.. నువ్వు ముట్టిందంతా బంగారమే అవుతుంది. అద్భుతమైన ప్రదర్శన..’ అని ట్వీట్ చేశాడు.  వసీం జాఫర్ స్పందిస్తూ... ‘రవీంద్ర జడేజా తన ఫీల్డింగ్ తో మ్యాచును మలుపుతిప్పగలడు... బ్యాట్ తో  బంతిని గెలిపించగలడు.. బాల్ తో సిరీస్ ను కూడా గెలిపించగలడు.. అతడు నిజమైన ఆల్ రౌండర్..’  అని రాసుకొచ్చాడు. దిగ్గజ క్రికెటర్లే గాక  నెటిజన్లు కూడా  జడ్డూ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.  టెస్టులకు టీ20లలో కూడా జడేజా అద్భుతంగా రాణించాడు. గతేడాది ఐపీఎల్ రిటెన్షన్  ప్రక్రియ సందర్భంగా  ధోనిని కూడా కాదని  చెన్నై సూపర్ కింగ్స్.. జడేజా ను ఏకంగా రూ. 16 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 

 

Scroll to load tweet…

తొలి ఇన్నింగ్స్ లో లంక ను ఆటాడుకున్న జడ్డూ..  రెండో ఇన్నింగ్స్ లో కూడా ఆ జట్టు పనిపట్టడంలో కీలక పాత్ర పోషించాడు.  ఫాలో ఆన్ ఆడుతున్న లంక బ్యాటర్లను  సెకండ్ ఇన్నింగ్స్ లో అశ్విన్-జడేజా కలిసి ఓ ఆటాడుకుంటున్నారు.  ఈ ఇన్నింగ్స్ లో కూడా జడ్డూ 12 ఓవర్లు  వేసి 35 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.  అశ్విన్ 18 ఓవర్లు వేసి  45 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో అశ్విన్.. భారత  దిగ్గజం  కపిల్ దేవ్ టెస్టులలో అత్యధిక వికెట్ల (434) రికార్డును అధిగమించాడు.