రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ... జిడ్డు బ్యాటింగ్తో విసిగిస్తున్న విరాట్ కోహ్లీ...
INDvsSA 3rd Test: మూడో రోజు లంచ్ బ్రేక్ విరామ సమయానికి 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసిన టీమిండియా... రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ...
INDvsSA 3rd Test: సౌతాఫ్రికాతో జరుగుతున్న కేప్ టౌన్ టెస్టులో భారత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షాట్ సెలక్షన్లో చేస్తున్న తప్పుల కారణంగా త్వరగా వికెట్లు కోల్పోతూ విమర్శలు ఎదుర్కొంటున్న రిషబ్ పంత్, కీలక సమయంలో మంచి ఇన్నింగ్స్తో ఆకట్టుకుని భారత జట్టును ఆదుకున్నాడు. ఓవర్నైట్ స్కోర్ 57/2 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, లంచ్ బ్రేక్ సమయానికి 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో దక్కిన 13 పరుగులతో కలిపి 143 పరుగుల ఆధిక్యంలో ఉంది టీమిండియా...
రిషబ్ పంత్ 60 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్తో 51 పరుగులు చేసి... టెస్టు కెరీర్లో 8వ హాఫ్ సెంచరీ నమోదు చేయగా... విరాట్ కోహ్లీ 127 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అగ్రెసివ్ కెప్టెన్సీ, అగ్రెసివ్ బ్యాటింగ్ చేసే విరాట్ కోహ్లీ... పరిస్థితులకు తగ్గట్టుగా తన బ్యాటింగ్ స్టైల్ను కూడా మార్చుకున్నాడు...
తొలి ఇన్నింగ్స్లో 79 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచిన విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్లో అదే ఇంటెంట్ చూపిస్తున్నాడు. ఈ టెస్టులో 300+పైగా బంతులను ఎదుర్కొన్నాడు కోహ్లీ... జిడ్డు బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను విసిగిస్తూ క్రీజులో పాతుకుపోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాడు...
మూడో రోజు టీమిండియాకి మొదటి ఓవర్ రెండో బంతికే షాక్ తగిలింది. 33 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా, మార్కో జాన్సెన్ బౌలింగ్లో కీగన్ పీటర్సన్ పట్టిన అద్భుతమైన క్యాచ్కి పెవిలియన్ చేరాడు...
ఆ తర్వాత 9 బంతుల్లో 1 పరుగు చేసిన అజింకా రహానే... కగిసో రబాడా బౌలింగ్లో డీన్ ఎల్గర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 11 బంతుల వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది భారత జట్టు...
టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఆన్రీచ్ నోకియా గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో టెస్టు ఆరంగ్రేటం చేసిన మార్కో జాన్సెన్... పూజారా వికెట్తో 17 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఆరంగ్రేటం సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన సౌతాఫ్రికా బౌలర్గా చరిత్ర క్రియేట్ చేశాడు జాన్సెన్...
ఇంతకుముందు 1995-96లో ఇంగ్లాండ్పై ఆరంగ్రేటం చేసిన షాన్ పోలాక్ 16 వికెట్లు తీయగా, ఇప్పటికే 17 వికెట్లు తీసిన జాన్సెన్... 26 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు...
రెండో ఇన్నింగ్స్లో 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది టీమిండియా. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 223 పరుగులకి ఆలౌట్ కాగా, సౌతాఫ్రికా జట్టు 210 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత జట్టుకి 13 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. సౌతాఫ్రికా బ్యాటర్ కీగన్ పీటర్సన్ 72 పరుగులు చేయగా కేశవ్ మహరాజ్ 25, భవుమా 28, వాన్ దేర్ దుస్సేన్ 21 పరుగులు చేశారు...
భారత బౌలర్ జస్ప్రిత్ బుమ్రా 5 వికెట్లు తీయగా ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలకు చెరో రెండేసి వికెట్లు దక్కాయి. శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తీశాడు... రెండో ఇన్నింగ్స్లో టీమిండియాకి శుభారంభం దక్కలేదు. మయాంక్ అగర్వాల్ 15 బంతుల్లో ఓ ఫోర్తో 7 పరుగులు, కెఎల్ రాహుల్ 22 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి అవుట్ అయ్యారు. విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా వికెట్ పడకుండా ఆడడంతో 57/2 వద్ద రెండో రోజు ఇన్నింగ్స్ను ముగించింది టీమిండియా...