Sanju Samson: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో సంజూ శాంసన్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో భారత్ 297 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచింది.
India vs South Africa 3rd ODI: పార్ల్లోని బోలాండ్ పార్క్లో దక్షిణాఫ్రికాతో జరిగిన కీలకమైన మూడో వన్డేలో భారత బ్యాటర్స్ రాణించడంతో 50 ఓవర్లలో భారత్ 296/8 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్, కీపర్ సంజూ శాంసన్ బ్యాట్ అదరగొట్టాడు. వన్డేల్లో తన తొలి సెంచరీని నమోదుచేశాడు. స్లోగా సాగుతున్న పిచ్ పై అద్భుతమైన ఆటతో శాంసన్ తొలి వన్డే సెంచరీ కొట్టాడు. 114 బంతుల్లో 108 పరుగులు చేసిన సంజూ శాంసన్.. విలియమ్స్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. శాంసన్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి.
తన తొలి వన్డే సెంచరీపై శాంసన్ మాట్లాడుతూ.. తాను గేమ్ పై దృష్టి పెట్టాననీ, దీంతో సెంచరీ సాధ్యమైందని తెలిపారు. తన తొలి వన్డే అంతర్జాతీయ సెంచరీపై ఆనందం వ్యక్తం చేశాడు."ఇప్పుడు భావోద్వేగానికి గురవుతున్నాను. నిజంగా ఎమోషనల్గా అనిపిస్తుంది. సెంచరీ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడి పని చేస్తున్నాను.. ఇప్పుడు ఫలితాలు వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే, కొత్త బంతితో సౌతాఫ్రికా బౌలర్లు బాగా బౌలింగ్ చేసారని పేర్కొన్నాడు. "పాత బంతి నెమ్మదిగా కదలడంతో బ్యాటింగ్ చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే కెప్టెన్ కేఎల్ రాహుల్ అవుట్ అయిన తర్వాత, మహరాజ్ చాలా బాగా బౌలింగ్ చేసే ఊపు వచ్చింది. కానీ నేనూ, తిలక్ మొదట బౌలింగ్ ను ఎదుర్కొని.. చివరలో బలంగా ముందుకు వెళ్లాం.కాబట్టి 40వ ఓవర్ నుండి మరింత వేగంగా ఆడాలనీ, పరుగులు చేయాలనుకున్నామని" చెప్పాడు.
