కెప్టెన్గా అజింకా రహానే, రోహిత్ శర్మకు రెస్ట్... న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కి జట్టు ఇదే...
India vs New Zealand Test Series: మొదటి టెస్టుకి కెప్టెన్గా అజింకా రహానే... టీ20 సిరీస్ ముగిసిన తర్వాత రెస్టు తీసుకోనున్న రోహిత్ శర్మ, రిషబ్ పంత్..
టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలో ఫైనల్ చేరిన న్యూజిలాండ్, ఆఖరాట ముగిసిన తర్వాత నేరుగా భారత్కి రానుంది. ఇండియా పర్యటనలో మూడు టీ20 మ్యాచులు, రెండు టెస్టు మ్యాచులు ఆడనుంది న్యూజిలాండ్. ఇప్పటికే టీ20 సిరీస్కి జట్టును ప్రకటించిన బీసీసీఐ, తాజాగా టెస్టు సిరీస్కి జట్టును ప్రకటించింది. తీరిక లేని షెడ్యూల్ కారణంగా గత ఆరు నెలలుగా బయో బబుల్లో గడుపుతున్న భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు.
టీ20 సిరీస్తో పాటు మొదటి టెస్టు ముగిసిన తర్వాత భారత జట్టుతో కలవబోతున్నాడు విరాట్. అలాగే తీరిక లేని క్రికెట్ ఆడుతున్న భారత టెస్టు స్పెషలిస్టులు రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీలతో పాటు టీ20 కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ టెస్టు సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు.
రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్కి రెస్ట్ ఇవ్వడంతో ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీ తరుపున ఆరంగ్రేటం చేసి అదరగొట్టిన తెలుగు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్కి న్యూజిలాండ్ టెస్టు సిరీస్ జట్టులో చోటు దక్కింది. అయితే సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా రెగ్యూలర్ వికెట్ కీపర్గా ఉంటాడు. సాహా మొదటి టెస్టులో ఫెయిల్ అయితే, రెండో టెస్టులో శ్రీకర్ భరత్ని ఆడించే అవకాశం ఉండొచ్చు.
అలాగే భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్కి తొలిసారి టెస్టుల నుంచి పిలువు వచ్చింది. అలాగే ఇంగ్లాండ్ టూర్లో జరిగిన నాలుగు టెస్టుల్లో బరిలో దిగని రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్... న్యూజిలాండ్ సిరీస్లో ప్రధాన బౌలర్లుగా మారనున్నారు.
అలాగే ఇప్పటిదాకా టీమిండియా తరుపున నాలుగు టెస్టులు ఆడిన జయంత్ యాదవ్, ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీతో 228 పరుగులు చేశాడు. 11 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాపై 2017లో ఆఖరి టెస్టు ఆడిన జయంత్ యాదవ్కి మళ్లీ నాలుగేళ్ల తర్వాత పిలుపు దక్కింది.
సీనియర్ పేసర్లు జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ విశ్రాంతి తీసుకోవడంతో వారి స్థానంలో యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం దక్కింది. సీనియర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్లతో కలిసి బౌలింగ్ చేయబోతున్నాడు ప్రసిద్ధ్ కృష్ణ...
Read: న్యూజిలాండ్ విజయం వెనక ఎమ్మెస్ ధోనీ... కెప్టెన్ కూల్ విన్నింగ్ ఫార్మాలాతోనూ కెప్టెన్ ఐస్...
నవంబర్ 25న కాన్పూర్ వేదికగా తొలి టెస్టు జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 3న ముంబై వాంఖడే స్టేడియంలో రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు టెస్టులు ఐసీసీ డబ్ల్యూటీసీ 2021-23 సీజన్లో భాగం కావడంతో పాయింట్లకు కీలకంగా మారనున్నాయి.
మొదటి టెస్టుకి భారత జట్టు: అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా, కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా, కెఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.. రెండో టెస్టులో భారత జట్టులో చేరే విరాట్ కోహ్లీ, కెప్టెన్గా వ్యవహరిస్తాడని తెలిపింది బీసీసీఐ.