India vs New Zealand: అశ్విన్కి లక్కీ వికెట్... 9 వికెట్లు, 280 పరుగులు, ఐదో రోజు కివీస్ ముందు...
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 4 పరుగులు చేసిన న్యూజిలాండ్... ఆఖరి రోజు విజయలక్ష్యం 280 పరుగులు... టీమిండియా విజయానికి 9 వికెట్లు...
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 234/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో దక్కిన 49 పరుగుల ఆధిక్యంతో కలిపి 283 పరుగుల ఊరించే టార్గెట్తో బరిలో దిగిన న్యూజిలాండ్ 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది..
6 బంతుల్లో 2 పరుగులు చేసిన కివీస్ ఓపెనర్ విల్ యంగ్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అయితే తన సహచర బ్యాట్స్మెన్ టామ్ లాథమ్తో చాలా సేపు మాట్లాడిన విల్ యంగ్, 15 సెకన్లు ముగిసిన తర్వాత డీఆర్ఎస్కి అప్పీలు చేశారు. అయితే అప్పటికే సమయం ముగిసిపోవడంతో అంపైర్లు, డీఆర్ఎస్కి తిరస్కరించారు. అన్యూహ్యంగా టీవీ రిప్లైలో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టుగా స్పష్టంగా కనిపించడం విశేషం...
విల్ యంగ్ వికెట్తో టెస్టుల్లో 417 వికెట్లను పూర్తి చేసుకున్న రవిచంద్రన్ అశ్విన్, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా హర్భజన్ సింగ్ రికార్డును సమం చేశాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది న్యూజిలాండ్. ఆఖరి రోజు న్యూజిలాండ్ విజయానికి 280 పరుగులు చేయాల్సి ఉంటుంది. భారత జట్టు 9 వికెట్లు పడగొట్టాల్సి ఉంటుంది.
అంతకుముందు రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు 234/7 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.. ఒకానొకదశలో 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాను లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆదుకున్నారు. తొలి టెస్టు ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్తో పాటు సీనియర్లు రవిచంద్రన్ అశ్విన్, వృద్ధిమాన్ సాహా, యంగ్ బౌలర్ అక్షర్ పటేల్ బ్యాటుతో రాణించి టీమిండియాకి మంచి స్కోరు అందించారు.
51/5 కోల్పోయి కష్టాల్లో పడిన దశలో శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ కలిసి ఆరో వికెట్కి 52 పరుగులు జోడించారు. 62 బంతుల్లో 5 ఫోర్లతో 32 పరుగులు చేసిన రవి అశ్విన్, జెమ్మీసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా కలిసి ఏడో వికెట్కి 64 పరుగుల భాగస్వామ్యం జోడించారు..
125 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్తో 65 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, టిమ్ సౌథీ బౌలింగ్లో వికెట్ కీపర్ టామ్ బ్లండెల్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆరంగ్రేటం టెస్టులోనే ఓ సెంచరీ+ ఓ హాఫ్ సెంచరీ నమోదుచేసిన మొట్టమొదటి భారత బ్యాట్స్మెన్గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు శ్రేయాస్ అయ్యర్...
తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో 50+ స్కోర్లు చేసిన మూడో భారత బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్. ఇంతకుముందు 1934లో దిల్వార్ హుస్సేన్, 1971లో సునీల్ గవాస్కర్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు...
తొలి ఇన్నింగ్స్లో 105, రెండో ఇన్నింగ్స్లో 65 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్... ఆరంగ్రేటం టెస్టులో 170 పరుగులు చేసి తొలి టెస్టులో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత బ్యాట్స్మెన్గా నిలిచాడు...
అయ్యర్ అవుటైన తర్వాత వృద్ధిమాన్ సాహా, అక్షర్ పటేల్ కలిసి ఎనిమిదో వికెట్కి 67 భాగస్వామ్యం నమోదుచేశారు. మొదటి ఐదు వికెట్లు 51 పరుగులకే కోల్పోగా, 6, 7, 8వ వికెట్లకు 50+ భాగస్వామ్యాలు నమోదయ్యాయి. 2007లో ఓవల్ టెస్టులో ఇంగ్లాండ్పై ఆరు, ఏడు, ఎనిమిదో వికెట్లకు 50+ భాగస్వామ్యాలు రాగా, ఇది రెండోసారి...
167/7 స్కోరు వద్ద డ్రింక్స్ బ్రేక్కి వెళ్లిన టీమిండియా, నాలుగో రోజు మూడో సెషన్లో వికెట్లేమీ కోల్పోకుండా పరుగులు చేసిన ఇండియా 234/7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అక్షర్ పటేల్ 67 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 28 పరుగులు, సాహా 126 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్తో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
నాలుగేళ్ల తర్వాత హాఫ్ సెంచరీ అందుకున్న వృద్ధిమాన్ సాహా, న్యూజిలాండ్పై మూడో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మెడ పట్టేయడంతో తొలి ఇన్నింగ్స్లో వికెట్ కీపింగ్కి రాని సాహా కెరీర్లో ఇది ఆరో టెస్టు హాఫ్ సెంచరీ కావడం విశేషం.