Ind Vs Nz: ఆ కాసులో ఏదో తిరకాసు ఉంది..? కాన్పూర్ లో కూడా కివీస్ టాస్ ఓడటంపై జిమ్మీ నీషమ్ అనుమానాలు..
India Vs New Zealand 1st Test: భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్.. టాస్ లు ఓడటమే గాక ఆ తర్వాత మ్యాచులను కూడా చేజార్చుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు.
కాన్పూర్ వేదికగా టీమిండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో కేన్ విలియమ్సన్ సారథ్యంలోని కివీస్ మరోసారి టాస్ ఓడింది. టాస్ గెలిచిన ఇండియా సారథి అజింకా రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే వరుసగా న్యూజిలాండ్ టాస్ లు ఓడటమే గాక ఆ తర్వాత మ్యాచులను కూడా చేజార్చుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. టాస్ వేసే కాసు లో ఏదో తిరకాసు ఉందని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మ్యచ్ తో కలిసి ఐదు మ్యాచుల్లో కివీస్ టాస్ ఓడింది.
ట్విట్టర్ వేదికగా స్పందించిన జిమ్మీ నీషమ్.. ‘దయచేసి ఆ నాణెల (టాస్ వేసే కాయిన్స్) ను నిశితంగా పరిశీలించగలరా..?’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతున్నది. నీషమ్ ట్వీట్ కు పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఇదంతా ఫిక్స్’ అని కామెంట్లు చేస్తున్నారు.
కాగా గత నాలుగు మ్యాచుల్లో న్యూజిలాండ్ టాస్ ఓడిపోయింది. అంతేకాదు మ్యాచులు కూడా ఓడింది. వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో జరిగిన తుది పోరులో కంగారు సారథి ఆరోన్ ఫించ్ టాస్ నెగ్గి కివీస్ కు ముందు బ్యాటింగ్ అప్పగించాడు. ఇక ఆ మ్యాచ్ తర్వాత భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్.. ఇటీవలే ముగిసిన మూడు టీ20లలో ఒక్కదాంట్లో కూడా టాస్ నెగ్గలేదు. ఫలితం 3-0తో సిరీస్ భారత కైవసం. ఆ మూడు మ్యాచుల్లో రోహిత్ శర్మ టాస్ గెలవడం విశేషం. మరి కాన్పూర్ లో జరుగుతున్న తొలి టెస్టులో కూడా టీ20లలో తేలిన ఫలితం పునరావృతం కానున్నదా..?
ఉపఖండపు పిచ్ లపై టాస్ ఓడితే మ్యాచులు కూడా ఓడినట్టే లెక్కగా భావిస్తారు. ముఖ్యంగా టెస్టులలో ఇక్కడ నాలుగో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. బంతి చాలా టర్న్ అవుతుంది. ఇది స్పిన్నర్లకు అనుకూలించే అంశం.
ఈ ఏడాది తొలి భాగంలో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ తొలి టెస్టులో జో రూట్ టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగాడు. ఆ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లీష్ జట్టు.. 578 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో భారత్.. 337 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత రనెండో ఇన్నింగ్స్ లో 192 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్లను ఎదుర్కోవడానికి భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. దీంతో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయాన్ని అందుకుంది. కానీ ఆ తర్వాత జరిగిన మూడు టెస్టులలో భారత్ దే విజయం.