Asianet News TeluguAsianet News Telugu

కేన్ విలియంసన్, టామ్ లాథమ్ హాఫ్ సెంచరీలు... వికెట్ కోసం టీమిండియా ఎదురుచూపులు...

నాలుగో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పిన కేన్ విలియంసన్, టామ్ లాథమ్... వికెట్ కోసం చెమటోడుస్తున్న భారత బౌలర్లు... 

India vs New Zealand 1st ODI: Kane Williamson, Tom Latham settled, team India looking for wickets
Author
First Published Nov 25, 2022, 2:00 PM IST

న్యూజిలాండ్, టీమిండియా మధ్య జరుగుతున్న తొలి వన్డే ఆసక్తికరంగా మారింది. 307 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్, 88 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ కేన్ విలియంసన్, వికెట్ కీపర్ టామ్ లాథమ్ కలిసి నాలుగో వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పారు...

25 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన ఫిన్ ఆలెన్‌ని శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు. 35 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది న్యూజిలాండ్. 42 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు చేసిన డివాన్ కాన్వేని ఉమ్రాన్ మాలిక్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత 16 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేసిన డార్ల్ మిచెల్ కూడా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు...

88 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ని కేన్ విలియంసన్, టామ్ లాథమ్ కలిసి ఆదుకున్నారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. న్యూజిలాండ్ విజయానికి ఆఖరి 80 బంతుల్లో 109 పరుగులు కావాలి...

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 76 బంతుల్లో 80 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా కెప్టెన్ శిఖర్ ధావన్ 72 పరుగులు చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో మెప్పించాడు. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించి, భారత జట్టుకి భారీ స్కోరు అందించాడు. 

ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ కలిసి తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి వికెట్‌కి 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, భారత జట్టుకి మంచి ఫ్లాట్‌ఫాం అందించారు. 65 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో డివాన్ కాన్వేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  

77 బంతుల్లో 13 ఫోర్లతో 72 పరుగులు చేసిన శిఖర్ ధావన్, టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.  శుబ్‌మన్ గిల్- శిఖర్ ధావన్ మధ్య ఇది నాలుగో సెంచరీ భాగస్వామ్యం. 9 ఇన్నింగ్స్‌ల్లో నాలుగుసార్లు 100కి పైగా భాగస్వామ్యం జోడించారు గిల్- గబ్బర్. ధావన్ అవుటైన తర్వాత శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పరుగులు రావడమే కష్టమైపోయింది. 

 23 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన రిషబ్ పంత్, లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  వస్తూనే ఫోర్ బాదిన సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత రెండో బంతికి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ కలిసి ఐదో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 

38 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసిన సంజూ శాంసన్, ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. 76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, ఆఖరి ఓవర్ వేసిన టిమ్ సౌథీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ మెరుపు బ్యాటింగ్ చేశాడు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios