ఇంగ్లాండ్తో ఐదో టెస్టు: కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా వీర ‘బాదుడు’.. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా ఆలౌట్...
స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో ఒకే ఓవర్లో 35 పరుగులు రాబట్టిన జస్ప్రిత్ బుమ్రా... బ్రియాన్ లారా రికార్డు బ్రేక్...తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా..
ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 416 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అనుకోకుండా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన భారత బౌలర్ జస్ప్రిత్ బుమ్రా, మెరుపుల మెరుపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఓవర్నైట్ స్కోరు 338/7 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి మెరుపు ఆరంభం అందించాడు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా.
183 బంతుల్లో 13 ఫోర్లతో 100 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, టెస్టు కెరీర్లో మూడో సెంచరీ నమోదు చేశాడు.. మ్యాటీ పాట్స్ బౌలింగ్లో నలుగురు బౌండరీలు బాదిన రవీంద్ర జడేజా, 79వ ఓవర్ ఆఖరి బంతికి ఫోర్తో సెంచరీ మార్కును అందుకున్నాడు. ఒకే ఇన్నింగ్స్లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు సెంచరీ చేయడం ఇది మూడోసారి.
ఇంతకుముందు 1999లో ఎస్ రమేశ్, సౌరవ్ గంగూలీ కలిసి న్యూజిలాండ్పై సెంచరీలు బాదారు. 2007లో సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్ ఇద్దరూ పాకిస్తాన్పై శతకాలు నమోదు చేశారు. 15 ఏళ్ల తర్వాత రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఇద్దరూ ఇంగ్లాండ్పై ఈ ఫీట్ నమోదు చేశారు...
ఏడో స్థానంలో బ్యాటింగ్కి వచ్చి రెండు సెంచరీలు చేసిన నాలుగో భారత క్రికెటర్గా రికార్డు క్రియేట్ చేశాడు రవీంద్ర జడేజా. ఇంతకుముందు 1986లో కపిల్ దేవ్, 2009లో ఎమ్మెస్ ధోనీ, 2010లో హర్భజన్ సింగ్ ఈ ఫీట్ సాధించారు. రవీంద్ర జడేజాతో కలిసి 8వ వికెట్కి 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత మహ్మద్ షమీ అవుట్ అయ్యాడు.
31 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసిన మహ్మద్ షమీ, స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో జాక్ లీచ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 194 బంతుల్లో 13 ఫోర్లతో 104 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జడేజా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జస్ప్రిత్ బుమ్రా... స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఇన్నింగ్స్ 84వ ఓవర్లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్తో 35 పరుగులు రాబట్టి అందరూ అవాక్కయ్యేలా చేశాడు..
ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు రాబట్టిన బ్యాటర్గా రికార్డు క్రియేట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా. ఇంతకుముందు 2003లో పీటర్సన్ బౌలింగ్లో బ్రియాన్ లారా 28 పరుగులు రాబట్టగా జస్ప్రిత్ బుమ్రా 35 పరుగులు స్కోరు చేసి సరికొత్త చరిత్ర లిఖించాడు. 6 బంతుల్లో 2 పరుగులు చేసిన మహ్మద్ సిరాజ్, జేమ్స్ అండర్సన్ బౌలింగ్లో అవుట్ కావడంతో 416 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్కి తెరపడింది. జేమ్స్ అండర్సన్ 5 వికెట్లు తీయగా మ్యాటీ పాట్స్ రెండు వికెట్లు తీశాడు. స్టువర్ట్ బ్రాడ్, బెన్ స్టోక్స్, జో రూట్ తలా ఓ వికెట్ తీశారు.
100 పరుగుల లోపు 5 వికెట్లు కోల్పోయిన తర్వాత భారత జట్టు 400+ చేయడం ఇది మూడోసారి మాత్రమే. ఇంతకుముందు రెండు సార్లు వెస్టిండీస్పై ఈ ఫీట్ సాధించిన టీమిండియా, ఇంగ్లాండ్పై తొలిసారి 400లకు పైగా పరుగులు చేసింది.