Asianet News TeluguAsianet News Telugu

తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం... షకీబ్ అల్ హసన్ పోరాడినా..

తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో విజయం అందుకున్న టీమిండియా... 84 పరుగులతో పోరాడిన బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. 

India vs Bangladesh 1st Test: Team India beats Bangladesh with huge margin
Author
First Published Dec 18, 2022, 9:57 AM IST

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం అందుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 272/6 వద్ద ఐదో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన బంగ్లాదేశ్, 324 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టీమిండియాకి 188 పరుగుల తేడాతో ఘన విజయం దక్కింది.  బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 108 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేసి పోరాటం చేసినా అక్షర్ పటేల్ 4, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని ముగించారు...

ఐదో రోజు 10 ఓవర్లలోనే మిగిలిన 4 వికెట్లను కోల్పోయింది బంగ్లాదేశ్. 48 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన మెహిదీ హసన్ మిరాజ్‌ని మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. 78 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న షకీబ్ అల్ హసన్, వరుస బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును 300+ మార్కు దాటించాడు..

అయితే 108 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేసి ప్రమాదకరంగా మారిన బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌ని కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియా విజయం ఖాయమైపోయింది. ఎడబత్ హుస్సేన్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లోనే డకౌట్ కాగా తైజుల్ ఇస్లామ్‌ని అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు..
 

కెప్టెన్‌గా కెఎల్ రాహుల్‌కి ఇదే తొలి విజయం. అనుకోకుండా సౌతాఫ్రికా టూర్‌లో జోహన్‌బర్గ్ టెస్టుకి కెప్టెన్సీ చేసిన కెఎల్ రాహుల్, అక్కడ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. జోహన్‌బర్గ్‌లో టీమిండియాకి తొలి పరాజయాన్ని అందించిన కెఎల్ రాహుల్, బంగ్లాదేశ్‌లో తొలి విజయం అందుకున్నాడు. 

513 పరుగుల భారీ టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలెట్టిన బంగ్లాదేశ్‌కి శుభారంభం అందించారు ఓపెనర్లు. తొలి వికెట్‌కి 124 పరుగుల భాగస్వామ్యం జోడించి, తొలి సెషన్‌లో వికెట్ కోల్పోకుండా పరుగులు రాబట్టారు...  156 బంతుల్లో 7 ఫోర్లతో 67 పరుగులు చేసిన నజ్ముల్ హుస్సేన్ షాంటో, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఫస్ట్ స్లిప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ చేతుల్లో పడి చేజారిన బంతిని డైవ్ చేస్తూ ఒడిసి పట్టుకున్న రిషబ్ పంత్, టీమిండియాకి మొదటి వికెట్ అందించాడు...

ఆ తర్వాత  యాసిర్ ఆలీ 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత లిటన్ దాస్, జాకీర్ హసన్ కలిసి మూడో వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 59 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన లిటన్ దాస్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో క్రీజులో కుదురుకుపోయిన ఆరంగ్రేటం ఆటగాడు జాకీర్ హసన్ 224 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో సెంచరీ చేశాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన మొట్టమొదటి బంగ్లా ఓపెనర్‌గా నిలిచిన జాకీర్ హసన్, సరిగ్గా 100 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

50 బంతుల్లో 2 ఫోర్లతో 23 పరుగులు చేసిన ముస్తాఫికర్ రహీం, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నురుల్ హసన్ 3 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లోనే స్టంపౌట్ అయ్యాడు. 8 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Follow Us:
Download App:
  • android
  • ios