బామ్మర్ది పెళ్లిలో రితికాతో కలిసి స్టెప్పులేసిన రోహిత్ శర్మ... వైరల్గా మారిన డ్యాన్స్ వీడియో...
ముంబైలో ఘనంగా రోహిత్ బామ్మర్ది వివాహం... భార్య రితికాతో కలిసి స్టేజీపై స్టెప్పులేసిన టీమిండియా కెప్టెన్... మ్యాచులు వదిలేసి, మస్తీ చేస్తున్నావా అంటూ ట్రోల్స్..
ఓ వైపు టీమిండియా ఆస్ట్రేలియాతో తొలి వన్డే ఆడుతుంటే, మరో వైపు కెప్టెన్ రోహిత్ శర్మ తన బామ్మర్ది పెళ్లిలో ఎంజాయ్ చేస్తున్నాడు. రోహిత్ భార్య రితికా సోదరుడు కృనాల్ పెళ్లిలో హిట్ మ్యాన్ డ్యాన్స్ చేస్తున్న వీడియో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
రితికా సోదరుడు కృనాల్ సాజ్దే వివాహం, ముంబైలోని తన స్వగృహంలో జరుగుతోంది. కృనాల్ సంగీత్ కార్యక్రమంలో భార్య రితికా శర్మ, పెళ్లి కొడుకుతో కలిసి స్టేజీపై డ్యాన్స్ చేసి అలరించాడు రోహిత్ శర్మ...
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వైపు టీమిండియా, ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ ఆడుతుంటే... మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ ఇలా బామ్మర్ది పెళ్లిలో డ్యాన్సులు వేస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు... ఒకవేళ తొలి వన్డేలో టీమిండియా ఓడిపోతే, రోహిత్ శర్మ మరిన్ని ట్రోల్స్ రావడం గ్యారెంటీ..
గాయాన్ని కూడా లెక్కచేయకుండా ఐపీఎల్ మ్యాచులు ఆడి 2020-21 ఆస్ట్రేలియా టూర్లో టీ20, వన్డే సిరీస్తో పాటు మొదటి రెండు టెస్టులకు కూడా దూరమయ్యాడు రోహిత్ శర్మ. ఇప్పుడు చిన్నచిన్న కారణాలతో టీమిండియాకి దూరంగా ఉంటున్నాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి పెద్దగా సమయం కూడా లేదు..
ఈ సమయంలో ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ని వదిలేసి, ఇలా బామ్మర్ది పెళ్లిలో మస్తీ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు నెటిజన్లు. అసలే రోహిత్ శర్మ చాలా సున్నితమైన మనిషి. ఇలా స్టెజీపై స్టెప్పులు వేసేటప్పుడు తొడ కండరాలు పట్టుకుంటే... ఎలాగా? అని కామెంట్లు పెడుతున్నారు మరికొందరు. ఇంకొందరైతే ఐపీఎల్ ముందు ఉండగా రోహిత్ శర్మ గాయపడే ప్రసక్తే లేదని, ఆ తర్వాత గాయపడకపోతే ఆశ్చర్యపోవాలని వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు..
మొత్తానికి టీమిండియా కెప్టెన్ అయ్యాక రోహిత్ శర్మ, ఏం చేసినా ట్రోల్స్కి టార్గెట్ అవుతున్నాడు. మూడేళ్ల క్రితం ఇలాగే ఓ పెళ్లికి హాజరు అయ్యేందుకు ఇంగ్లాండ్ టూర్కే డుమ్మాకొట్టాడు రోహిత్ శర్మ. అప్పుడు ఆ విషయాన్ని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. కారణం రోహిత్ కేవలం ప్లేయర్గా మాత్రమే టీమ్లో ఉండడం. ఇప్పుడు కెప్టెన్ అయ్యక కూడా రోహిత్ అలాగే చేస్తుండడంతో జనాలు బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు.
గత ఏడాది టీమిండియా రికార్డు స్థాయిలో మొదటి 8 నెలల కాలంలో ఏడుగురు కెప్టెన్లను మార్చింది... పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ శర్మ, ఆ విషయం మరిచిపోయినట్టుగా అప్పుడప్పుడూ టీమ్లోకి వచ్చి పోయాడు. ఫిట్నెస్ సమస్యలు, వ్యక్తిగత కారణాలు, వర్క్లోడ్ మేనేజ్మెంట్ పేరుతో టీమిండియా ఆడిన మెజారిటీ సిరీస్లకు దూరమయ్యాడు రోహిత్ శర్మ...
2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్లీ 2023లో స్వదేశంలో 50 ఓవర్ల ప్రపంచ కప్ ఆడబోతోంది టీమిండియా. ఇది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లకు ఆఖరి వరల్డ్ కప్ అని కూడా ప్రచారం జరగుతోంది..